మహిళపై లైంగిక వేధింపులు... పెద్దపెద్ద నగరాల్లో అలాంటివి జరుగుతాయన్న హోంమంత్రి

Sexual assault in Bengaluru: మహిళపై లైంగిక వేధింపులు... పెద్దపెద్ద నగరాల్లో అలాంటివి జరుగుతాయన్న హోంమంత్రి
Man groping woman in Bengaluru streets caught on CCTV camera: బెంగళూరులో తాజాగా ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. రాత్రివేళ రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు యువతుల్లో ఒక యువతిని ఒక యువకుడు లైంగికంగా వేధించి పరారయ్యాడు. బీటీఎం లేఔట్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను గమనిస్తే... ముందుగా ఇద్దరు మహిళలు వెళ్తున్నారు. వారినే అనుసరిస్తూ వెనకాలే ఒక వ్యక్తి వెళ్తున్నారు. అతడు ఆ ఇద్దరిలో ఒకరిపై చేయి వేసి తడుముతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. మరో మహిళ ఆమెను అతడి బారి నుండి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ లైంగిక దాడి అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు.
బెంగళూరు వాసులు, నెటిజెన్స్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బెంగళూరు లాంటి పెద్ద మెట్రో సిటీలోనే మహిళలకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని, పోలీసులను సోషల్ మీడియా ద్వారా నిలదీస్తున్నారు.
జనం నుండి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో తాజాగా కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర స్పందించారు. అయితే, ఈ ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతకంటే ఎక్కువ దుమారం రేపుతున్నాయి.
హోంమంత్రి పరమేశ్వర స్పందిస్తూ... బెంగళూరు లాంటి పెద్దపెద్ద నగరాల్లో ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు. ఇవాళ ఈ ఘటన జరిగింది కాబట్టి జనం దృష్టి అంతా మహిళల భద్రతపైకి మళ్లింది. కానీ తను రోజూ సిటీ పోలీసు కమిషనర్తో మాట్లాడి మహిళల భద్రత గురించే ఆదేశాలు ఇస్తుంటానని అన్నారు. పోలీసు పెట్రోలింగ్ పెంచాల్సిందిగా చెబుతుంటానని తెలిపారు. పోలీసులు 24X7 పనిచేస్తున్నారు. అయినప్పటికీ బెంగళూరు లాంటి పెద్ద నగరంలో ఎప్పుడో అప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఇప్పటివరకు బాధితులు ఎవ్వరూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ బాధితులు ఎవరో గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.
ఇదిలావుంటే, ఈ ఘటనపై హోంమంత్రి జి పరమేశ్వర స్పందించిన తీరుపై బీజేపి అధికార ప్రతినిధి జి ప్రశాంత్ తీవ్రంగా తప్పుపట్టారు. హోంమంత్రి వ్యాఖ్యలను చూస్తోంటే, మహిళలపై దాడులను సాధారణ ఘటనల కింద చూస్తున్నట్లుగా అర్థమవుతోందని ప్రశాంత్ మండిపడ్డారు.