CM Jagan: మిచౌంగ్ తుఫాన్పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష
CM Jagan: కరెంట్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి
CM Jagan: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తుపాను పరిస్థితులపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు.
తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు.. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని ఆదేశించారు.