టార్గెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్.. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ

CM Revanth Reddy America Tour Updates
x

టార్గెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్.. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ

Highlights

Revanth Reddy: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ వేట కొనసాగుతోంది.

Revanth Reddy: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్ భేటీలు, లంచ్‌ మీటింగ్‌లతో ఆయన బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్నారు. పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. అమెరికాకు చెందిన వాల్ష్‌ కర్రా హోల్డింగ్స్‌ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. వచ్చే ఐదేళ్లలో వీ హబ్‌లో 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వీ హబ్‌తోపాటు తెలంగాణలో నెలకొల్పే స్టారప్‌లలో దాదాపు 839 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. వాల్ష్‌ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రెగ్‌వాల్ష్‌.. వీ హబ్‌ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీ అమెరికా, సింగపూర్ నుంచి పని చేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో పెట్టుబడిదారులు గ్రెగ్ వాల్ష్, ఫణి కర్రా దీన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాలను వృద్ధి చేయాలనేది కంపెనీ సంకల్పం. కొత్త ఆవిష్కరణలు, స్థిరత్వంతో పాటు లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతు ఇస్తుంది. వీటిలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాల విస్తరణతో పాటు స్థిరమైన భవిష్యత్తు నిర్మించేందుకు సహకరిస్తుంది. ఈ ఒప్పందంతో మరో అడుగు ముందుకు పడిందని గ్రెగ్ వాల్ష్ అన్నారు. పెట్టుబడులతో పాటు పట్టణాలతో పాటు గ్రామీణ తెలంగాణలోనూ ప్రభుత్వంతో కలిసి వివిధ కార్యకలాపాలు చేపట్టి నమ్మకమైన భాగస్వామ్యం పంచుకుంటామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభించి.. అంతర్జాతీయ స్థాయికి చేరగలిగానని, మన దేశం, రాష్ట్రం పట్ల కృతజ్ఞతను చాటుకునే అవకాశం దొరికిందని ఫణి అన్నారు. తమ పెట్టుబడులు, తమ సంస్థ భాగస్వామ్యం తప్పకుండా సానుకూల ప్రభావం చూపుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు రూపొందించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడుతాయని వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు.

దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో.. ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వాల్ష్ కర్రా ప్రతినిధులను అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే తెలంగాణ సామర్థ్యాన్ని చాటి చెపుతున్నారని, పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతలను తొలిగిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థాన్యి సాధించలేదని అభిప్రాయ పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories