Telangana: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై సీఎం రేవంత్ ఫోకస్

CM Revanth focus is on increasing revenue for the state treasury
x

Telangana: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై సీఎం రేవంత్ ఫోకస్

Highlights

Telangana: ఆదాయం తెచ్చే ప్రధాన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష

Telangana: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేటేషన్లు, రవాణా శాఖల ఉన్నతాధికారులతో సీఎం దాదాపు నాలుగు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఆదాయం పెంచేందుకు వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకు వచ్చిన ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు ఆదాయం రావాలంటే ఆయా శాఖలు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగాలని, పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకుని, ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఆదాయం వచ్చే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని స్పష్టంచేశారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్‌వ్యవస్థీకరించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.

నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెల నెలా లక్ష్యాలను నిర్దేశించుకొని రాబడి సాధించాలన్నారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్షిస్తానని... ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు.

ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీని పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. వాణిజ్య పన్నుల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్‌ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా విమాన ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు ఆదాయం పెరగకపోవటానికి కారణమేంటని సీఎం రేవంత్‌ ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని తెలిపారు. డిస్టిలరీస్‌ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు.

రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్‌ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ది కార్యక్రమాలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సీఎం అభిప్రాయపడ్డారు. కమర్షియల్ నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా పుంజుకుంటాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories