Bonalu: అమ్మవారికి బోనం..ఆధ్యాత్మిక సంబురమే కాదు..అంటు వ్యాధులను తరిమికొట్టే ఆయుధం

Bonalu: అమ్మవారికి బోనం..ఆధ్యాత్మిక సంబురమే కాదు..అంటు వ్యాధులను తరిమికొట్టే ఆయుధం
x

Bonalu: అమ్మవారికి బోనం..ఆధ్యాత్మిక సంబురమే కాదు..అంటు వ్యాధులను తరిమికొట్టే ఆయుధం

Highlights

Bonalu: ఆషాడమాసం వచ్చిందంటే భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అవుతుంది. ఈ ఏడాది జులై 7వ తేదీ ఆదివారం నుంచి బోనాలు మొదలవుతున్నాయి. జగదాంబకి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల పండగ మొదలవుతుంది. ఈ ఆధ్యాత్మిక సంబురం వెనకున్న ఎన్నో ఆరోగ్య రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Bonalu:మనిషికి, ప్రకృతికి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరాన్నినడిపించేది మానవాతీతశక్తి అని అంటుంటారు. అందుకే పుట్టుక, జీవనం, మరణం అన్నీ కూడా విచిత్రంగానే ఉంటాయి. వాటి వెనక ఎన్ని శాస్త్రీయ కారణాలున్నా..అంతుచిక్కని సందేహాలు ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రకృతిశక్తికి ప్రతిరూపంగా అమ్మను పూజించే పర్వదినేమే బోనాలు. జులై 6వ తేదీన ఆషాడమాసం షురూ అవుతుంది. జులై 7న ఆదివారం బోనాలు మొదలవుతాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబించే ఈ పండుగ వెనక ఆధ్యాత్మిక కారణాలకంటే మించిన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.

బోనం తయారు చేసేందుకు కొత్త కుండను ఎంచుకుంటారు. కుండకు సగం వరకు సున్నం పూస్తారు. పై భాగానికి నూనెపూస్తారు. పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. ఘటాన్ని అన్నంతో నింపి దాన్ని చుట్టూ వేపకొమ్మలు కడతారు. ఘటంపై ప్రమిదను పెట్టి దీపం వెలిగిస్తారు. ఇలా తయారు చేసిన బోనంను తోటి మహిళలతో కలిసి గుంపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆషాడం అంటే వర్షాకాలం మొదలైనట్లు. ఈసమయంలో కురిసే వర్షాలకు చెరువులు, కుంటలు, చిన్న చిన్న గుంటలు నీటితో నిండిపోతాయి. విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వైద్య విజ్నాన శాస్త్రం పరిణతి చెందని కాలంలో పల్లెల్లో ప్లేగు, కలరా, మశూచి వంటి అంటు వ్యాధుల బారిన ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్నే మరో భాషలో గత్తర అని పిలిచారు.

ఈ వైపరీత్యాల నుంచి కాపాడాలంటూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు. ఆ ఆరాధనకోసం వినియోగించే వస్తువులన్నీ కూడా వైరస్ ను చంపేవే. ఊరూ వాడా శుభ్రం చేయడం ద్వారా సగం సూక్ష్మక్రిములను తరిమికొడితే..వేపాకులు, పసుపు నీళ్ల వినియోగంతో అంటు వ్యాధులను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ప్రతి లోగిలి ముందు కళ్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, వేపాకులు, పసుపుతో సూక్ష్మ క్రిములు దూరం అవుతాయి. బోనం కుండలో అన్నం, ఉల్లిగడ్డ, మిరియాలు, పరమాన్నం ఉంచుతారు. దానిపై మూతపెట్టి నూనెపోసి దీపం వెలిగిస్తారు. మొదట ఇంట్లో దేవుడి దగ్గర ఉంచి ఆ తర్వాత ఆలయానికి వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. వంశం వృద్ధి చెందాలని కుటుంబమంతా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ కల్లు సాక పోసతారు. మశూచి వంటి అనారోగ్యలు రాకుండా ఇది కాపాడుతుందని చెబుతుంటారు.

వేపాకులతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ గాలి తగిలినా ఆరోగ్యమే. అందుకే అంటు వ్యాధులు ప్రబలే ఆషాడం ఆరంభంలో బోనాల జాతరలో ఎక్కడచూసినా వేపాకులే కనిపిస్తుంటాయి. వేపాకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పరగడుపునే వేపాకులు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కడుపులో అల్సర్లు, గ్యాస్, కంటికి సంబంధించిన రుగ్మతలు తొలగిపోతాయి.ఇక పసుపు ఆయుర్వేద ఔషధాల్లో ప్రధానమైంది. పసుపు వినియోగం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు. క్యాన్సర్ ను నిరోధించడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుందని న్యూట్రియంట్స్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories