సాధారణంగా గుడికివెళ్ళిన కొందరు భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.. ప్రదక్షిణము, పరిక్రమము అనే పదానికి అర్ధం తిరగడం.
సాధారణంగా గుడికివెళ్ళిన కొందరు భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.. ప్రదక్షిణము, పరిక్రమము అనే పదానికి అర్ధం తిరగడం.హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట, దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.
ప్రదక్షిణలు రెండు రకాలుగా మనం చెప్పుకుంటున్నాం.. అసలు ఈ ప్రదక్షలు ఎందుకు చేస్తారు..? మనిషికి ఏదైనా కోరిక ఉంటే మనసులో దేవుడిని ప్రార్ధిస్తూ తన కోరిక తీర్చమని దేవుడికి ఇష్టమైన నైవేద్ధ్యం లేదా కొబ్బరికాయ కొట్టి అర్థిస్తారు.. కానీ దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముందనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు... అసలు దీనికి సంభంధమేంటని అరా తీస్తే కొందరు పండితులు ఇలా చెబుతున్నారు.
మనకి కనిపించే 'సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.
ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం 'చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇలా మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది.. తద్వారా మనిషికి ప్రశాంతత, జ్ఞానం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు..
పద్ధతులు:
ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు.
ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకోగలం. అంతే కాదు అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణ లోని ప్రధానోద్దేశ్యం.
పురాణ కథ:
"విశ్వమంతా తిరిగి శీఘ్రంగా ప్రదక్షిణ చేసి వచ్చిన వానికే గణాధిపత్యం" అని పార్వతీ పరమేశ్వరులు షరతు విధించినపుడు కుమారస్వామి మయూర వాహనంపైనెక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలు దేరాడు. మూషిక వాహనుడైన మహాగణపతి అలా వెళ్ళలేకపోయాడు. కానీ, తెలివిగా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చిత్రంగా సుబ్రహ్మణ్యుడు వెళ్ళిన ప్రతి చోటా అంతకు మునుపే గణపతి వచ్చి వెళ్ళిన జాడలు కనిపించాయి. ముందుగా విశ్వాన్ని చుట్టి వచ్చిన వాడు వినాయకుడేనని నిర్ణయించి- శివుడు, ఇతర దేవతలు అతనికే గణాధిపత్యాన్ని ఇచ్చారు. కుమారస్వామి అలకను తీర్చి పార్వతీ పరమేశ్వరులు బుజ్జగించారు.
అయితే ఈ కథలో కుమారస్వామి, గణపతి లలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిష్కరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. అన్ని చోట్లా ఈశ్వరుని సందర్శించాలన్నది సుబ్రహ్మణ్యుని బోధ.
దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల ప్రదక్షిణములు ఒక దాని కంటే ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదాని కంటే ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము, సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధిప్రథమని చెప్పబడింది.
శ్రీ రమణ మహర్షి 'ప్రదక్షిణం' అన్న పదాన్ని విశ్లేషించారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. 'ద' అంటే కోరికలన్నీ తీరడమని భావం. 'క్షి' అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు.
గో ప్రదక్షిణ పురాణం:
బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.
ప్రదక్షిణంలో రకాలు:
ఆత్మ ప్రదక్షిణము : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం.
పాద ప్రదక్షిణము : పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం.
దండ ప్రదక్షిణము : అవ్యగ్ర చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం.
అంగ ప్రదక్షిణము : సాత్వికావయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం.
గిరి ప్రదక్షిణము : దేవుడు కొలువుండే కొండ చుట్టు చేసే ప్రదక్షిణం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire