ఉదకం చందనం చక్రమ్ శంఖంచ తులసీదళమ్॥ఘంటాం పురుష సూక్తంచ తామ్రపాత్ర మథాష్టమమ్॥ సాలగ్రామ శిలాచైవ నవభిస్తీర్థముచ్చతే భక్తులు ఆలయానికి వెళ్లి...
ఉదకం చందనం చక్రమ్ శంఖంచ తులసీదళమ్॥
ఘంటాం పురుష సూక్తంచ తామ్రపాత్ర మథాష్టమమ్॥
సాలగ్రామ శిలాచైవ నవభిస్తీర్థముచ్చతే
భక్తులు ఆలయానికి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత అర్చకుడు భగవంతునికి నివేదించిన తీర్థాన్ని అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు.
పరమాణు సమానమైన ఈ తీర్థాన్ని సేవించడం వలన పంచ మహాపాతకాలన్ని తొలగిపోతాయని అర్చకులు చెపుతుంటారు. ఇంతటి పవిత్రమైన తీర్థాన్ని భక్తులు కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి. ఒక వేళ తీర్ధం నేల మీద పడితే అది ఎనిమిది రకాల పాపాలు చుట్టుకుంటాయని భక్తుల నమ్మకం.
తీర్థం తీసుకోవడం వలన కలిగే లాభాలు..
సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని, పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు. భగవంతుడిని నైవేద్యంగా పెట్టిన తీర్థాన్ని భక్తలు తీసుకుంటే వారికి సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం సిద్దిస్తుంది చెపుతుంటారు. అంతే కాక ఆ భగవంతుని ఆశ్వీర్వాదాలను పొందుతారని పురాణాల్లో తెలిపారు. అదే విధంగా తులసితో కూడిన సాలగ్రామ తీర్థాన్ని తీసుకోవడం వలన అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. భగవంతునికి నైవేద్యంగా పెట్టే తీర్థంలో ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం అనే తొమ్మిది పదార్థాలను కలుపుతారు.
తీర్థాన్ని ఏ విధంగా తీసుకోవాలి..
తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకోవాలి, దానిపై కుడిచేతిని పెట్టి శంఖువు ఆకారంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటన వేలు పైన చూపుడు వేలుని ఉంచాలి. తరువాత అర్చకులు ఇచ్చే పవిత్రమైన తీర్ధాన్ని కాస్త కూడా కింద పడకుండా తీసుకోవాలి.
ఇకపోతే అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఓ విశేషం ఉంది. హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది. అదేవిధంగా చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్నిఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ, అవి అన్నీ దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పట్టి తీర్థం తీసుకుంటారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire