చరిత్రలో తొలిసారిగా తాత్కాలికంగా తిరుమల శ్రీవారికి భక్తులు దూరమవుతున్నారు
సప్తగిరులు మూగబోయాయ్. గోవింద నామ స్మరణలు ఆగిపోయాయ్. ఏడుకొండలపైకి రాకపోకలు నిలిచిపోయాయ్. నడకదారులు మూసుకుపోయాయ్. చరిత్రలో తొలిసారిగా తాత్కాలికంగా...
సప్తగిరులు మూగబోయాయ్. గోవింద నామ స్మరణలు ఆగిపోయాయ్. ఏడుకొండలపైకి రాకపోకలు నిలిచిపోయాయ్. నడకదారులు మూసుకుపోయాయ్. చరిత్రలో తొలిసారిగా తాత్కాలికంగా తిరుమల శ్రీవారికి, భక్తులు దూరమవుతున్నారు. వారం రోజుల పాటు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూడలేకపోతున్నారు. కరోనా వైరస్ అలర్ట్తో కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ ఏడుకొండలపైకి వెళ్లే అన్ని దారులను క్లోజ్ చేసేసింది.
తిరుమల శ్రీవారిపై కరోనా ఎఫెక్ట్. ఆలయం తాత్కాలికంగా మూసివేత. వారం రోజుల పాటు భక్తులకు దూరంగా భగవంతుడు. కరోనా మహమ్మారి ప్రభావం మనుషులపైనే కాదు, దేవుళ్లపైనా చూపిస్తుంది. భక్తులకు భగవంతుడి దర్శన భాగ్యం లేకుండా చేస్తోంది. కరోనా దెబ్బతో ఇప్పటికే దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడగా, తాజాగా తిరుమల ఆలయం కూడా అదే బాటలో నడుస్తోంది. కరోనా వైరస్ విజృంభణ రోజు రోజుకూ అధికమవడంతో టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తిరుమలపై కూడా పూర్తిగా పడకుండా అడ్డుకట్ట వేస్తోంది. అందులో భాగంగా అలిపిరి చెక్ పోస్ట్ను మూసివేసింది. వాహనాలను ఏడుకొండలపైకి నిషేధించింది. అలిపిరి కాలినడక, శ్రీవారి మెట్టు మార్గంలో కూడా భక్తుల్ని అనుమతించడం లేదు. మొత్తంగా తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూతపడిపోయాయ్. నిత్యం లక్షలాది మంది భక్తుల హరి నామస్మరణతో తరించే తిరుమల కొండలు ప్రస్తుతానికి మూగబోయాయ్.
కరోనావైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. కాకపోతే శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని టీటీడీ తెలిపింది. అలాగే, ఇప్పటి వరకు టైమ్ స్లాట్లు బుక్ చేసుకున్న భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని ఈవో ఏకే సింఘాల్ తెలిపారు.
తిరుమలకు నిత్యం లక్షలాది మంది వస్తుంటారు. సప్తగిరులపై కొలువుదీరిన దేవదేవుడి దర్శనం కోసం తపించిపోతుంటారు. పరవశించిపోతారు. అలాంటిది టీటీడీ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా కఠిన నిర్ణయం తీసుకుంది. చారిత్రకంగా మూడో శతాబ్దంలో నిర్మితమైన శ్రీవారి ఆలయంలో ఇప్పటి వరకూ స్వామివారికి జరిగే రోజువారీ కైంకర్యాలు, వారాంతపు సేవలను రద్దుచేసిన సందర్భాలు లేవు. 1892లో రెండురోజులు తిరుమల ఆలయానికి ఈ పరిస్థితి ఎదురైందని సింఘాల్ చెబుతున్నారు.
ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ ను మూసివేసి భక్తుల నేరుగా దర్శనం కల్పిస్తున్న టీటీడీ శ్రీవారి పుష్కరిణిని కూడా మూతవేసింది. తిరుమలపై ఇప్పటికే ఉన్న భక్తులకు త్వరగా దర్శనం కల్పించి వారిని కొండ కిందికి పంపించేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బంది మినహా భక్తులందర్నీ కొండ పై నుంచి ఖాళీ చేయిస్తున్నారు. కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను కూడా ఆలయానికే పరిమితం చేసే విషయంపై ఆగమ సలహాదారులను సంప్రదిస్తోంది టీటీడీ. ఏమైనా కనీసం విశ్రాంతి దొరకని శ్రీవారు వారం రోజుల పాటు ఫుల్లుగా ఏకాంత సేవతో సేద తీరనున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire