Krishna Janmashtami: కారాగారం నుంచి రేపల్లెకు కన్నయ్య రాక.. గోకులాష్టమి వెనుక అసలైన చరిత్ర తెలుసా?

Krishna Janmashtami History
x

Krishna Janmashtami: కారాగారం నుంచి రేపల్లెకు కన్నయ్య రాక.. గోకులాష్టమి వెనుక అసలైన చరిత్ర తెలుసా?

Highlights

శ్రీ కృష్ణుడికి ప్రీతిపాత్రమైన తెల్లటి వెన్న, పాలను కుండలో ఉట్టి కొట్టే కార్యాక్రమాలను ఏర్పాటు చేస్తారు. దేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు.

Krishna Janmashtami 2024: హిందువులు పవిత్రంగా నిర్వహించుకునే పండుగలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఒకటి. కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ కృష్ణుడికి ప్రీతిపాత్రమైన తెల్లటి వెన్న, పాలను కుండలో ఉట్టి కొట్టే కార్యాక్రమాలను ఏర్పాటు చేస్తారు. దేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కృష్ణుడి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. భక్తులు ఆలయాలకు నూతనంగా రంగులు వేయడంతోపాటు విద్యుద్ధీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీకృష్ణాష్టమిని ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భాగవతం ప్రకారం మహావిష్ణువు 8వ అవతారం శ్రీ కృష్ణ భగవానుడు. రాక్షసుడైన కంసుడు సోదరి దేవకి, వసుదేవుడికి వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి ప్రత్యక్షమమవుతుంది. తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, వసుదేవుడిని కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తూ ఉంటాడు. ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకీ ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి... కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంన అర్ధరాత్రి వేళ శ్రీ కృష్ణుడు జన్మించాడు. తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీ వసుదేవులు.

అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వసుదేవుని సంకెళ్లు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాల కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి... ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు. అప్పుడు తన సంకెళ్లు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసుని సమాచారం చేరవేస్తారు.

ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగ బిడ్డ పుట్టాలి. ఆడపిల్ల పుట్టిందని... తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగ మాయగా మారి... కంసుడికి దొరక్కుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు.. రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగ బిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది.

వేణు మాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికీ దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా... తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోప బాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కల్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరు బాగా ఇష్టపడతారు. కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories