Wife Kills Husband: భర్త కోసం పగలంతా ఉపవాసం చేసి, రాత్రికి అన్నంలో విషం పెట్టి చంపేసింది

Wife Kills Husband: భర్త కోసం పగలంతా ఉపవాసం చేసి, రాత్రికి అన్నంలో విషం పెట్టి చంపేసింది
x
Highlights

Wife Kills Husband: తన భర్త నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించమని కోరుతూ మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఉపవాసం కూడా...

Wife Kills Husband: తన భర్త నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించమని కోరుతూ మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఉపవాసం కూడా ఉంటుంటారు. ఉత్తరాదిన కర్వా చౌత్ పేరిట జనం వేడుకగా సెలబ్రేట్ చేసుకునే పండగ కూడా అలాంటిదే. తన భర్త దీర్ఘాయుష్షుతో ఉండేలా ఆశీర్వదించమని కోరుతూ కర్వా చౌత్ నాడు మహిళలు పగలంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం చీకటి పడే సమయానికి ఆకాశంలో చంద్రుడు ప్రత్యక్షం కాగానే పిండిపట్టే జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి దర్శనం చేసుకుంటారు. అలా చంద్రుడిని చూస్తూనే అదే జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూసి వారి పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇదొక ఆనవాయితీ. బాలీవుడ్ సినిమాల్లో, హిందీ టీవీ సీరియల్స్‌లో తరచుగా చూసే సంప్రదాయమే.

ఇక ఇప్పుడు తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఒక రియల్ స్టోరీ విషయానికొస్తే.. కౌషంబీ జిల్లాలో సవిత అనే ఒక మహిళ ఆదివారం పగలంతా కర్వా చౌత్ ఉపవాసం పాటించారు. భర్త శైలేష్ కుమార్ కూడా ఇంట్లో పండగ కోసం ఉదయం నుండి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. సాయంత్రం ఉపవాసం పూర్తయ్యే సమయానికి భార్య, భర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త శైలేష్ కి మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందనేది ఆమె అనుమానం. ఇదే విషయమై ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇద్దరూ గొడవపడ్డారు. ఎలాగోలా ఆ తరువాత ఇద్దరూ రాజీకొచ్చారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు.

భార్యతో రాజీకొచ్చాక హమ్మయ్య అని శైలేష్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ సవిత మనసులో ఏం రన్ అవుతుందనే విషయం భర్తకు తెలియదు. అంతలోనే పక్కింటికి వెళ్లి ఏదో తీసుకురమ్మని భార్య చెప్పడంతో శైలేష్ అలా పక్కింటికి వెళ్లారు. అతను తిరిగొచ్చే లోపే సవిత అక్కడి నుండి పరారయ్యారు. మరోవైపు శైలేష్ నురగలు కక్కుతూ కిందపడిపోయారు. శైలేష్ తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పుడే తెలిసింది "అతడు తిన్న అన్నంలో విష ప్రయోగం జరిగింది" అని. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో పోలీసులు అతడి స్టేట్మెంట్ వీడియో రికార్డు చేసుకున్నారు. ఆ తరువాత చికిత్స పొందుతూ శైలేష్ ప్రాణాలు కోల్పోయారు.

శైలేష్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు సవితను అదుపులోకి తీసుకున్నారు. కర్వా చౌత్ పండగ వేళ యూపీలోని కౌషంబీ జిల్లా కడా ధామ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పగలంతా భర్త ఆయుష్షు కోసం పూజలు, ఉపవాసాలు చేసి లేనిపోని అనుమానాలతో రాత్రికి ఆమె భర్త ప్రాణం తీశారు కదా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories