పాకిస్థాన్కు మరో పరాభవం ఎదురయింది. తమ దేశంలో పెరుగుతోన్న ఉగ్రవాదాన్ని అణచడంలో సరైన చర్యలు తీసుకోని కారణంగా అంతర్జాతీయ సమాజం నుండి ఆంక్షలను...
పాకిస్థాన్కు మరో పరాభవం ఎదురయింది. తమ దేశంలో పెరుగుతోన్న ఉగ్రవాదాన్ని అణచడంలో సరైన చర్యలు తీసుకోని కారణంగా అంతర్జాతీయ సమాజం నుండి ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తోంది. తాజాగా గ్లోబల్ మనీ లాండరింగ్ వాచ్ డాగ్.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, పాక్ ను గ్రే లిస్ట్ నేషన్ గా ప్రకటించనుండటంతో ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు.
పక్కలో బల్లెంలా వున్న పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలనుకుంటున్న భారత్ ప్రయత్నా లు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను నాశనం చేసేందుకు ప్రపంచమంతటిని ఏక తాటిపైకి తీసుకరావడంలో భారత్ ఓ రకంగా విజయం సాధించిందనే చెప్పాలి. తాజాగా పాకిస్థాన్ని గ్రే లిస్ట్ నేషన్ గా ప్రకటించడం భారత దౌత్య సమర్థతగానే పేర్కొనాలి.
ప్రపంచంలో హవాలా -ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం లాంటి విషయాలపై నిరంతర పర్యవేక్షణ కోసం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. దీని కేంద్ర కార్యాలయం పారిస్ లో వుండగా , ఇందులో మొత్తం 35 దేశాలు సభ్యత్వం కలిగి వున్నాయి. అఫ్ఘనిస్తాన్ , భారత్ లాంటి దేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ కారణమవుతోంది. దీనికి తోడు ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడంలో విఫలం అవుతుందన్న కారణాలతో అమెరికా , పాకిస్తాన్ దేశాన్ని గ్రే లిస్ట్ నేషన్ గా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి బ్రిటన్ , ఫ్రాన్స్ ,జర్మనీ దేశాలు మద్దుతు పలికాయి. అయితే అన్ని విషయాల్లోనూ పాకిస్థాన్ కు మద్దతు పలికే చైనా కూడా ఆ దేశానికి సపోర్ట్ చేయకపోవడం , సౌదీ అరెబియా , గల్ఫ్ దేశాలు కూడా పాకిస్థాన్ వైపు లేకపోవడంతో దాదాపు ఆ దేశాన్ని గ్రే లిస్ట్ నేషన్ గా ప్రకటించడం ఖరారైనట్లేనని తెలుస్తోంది. దీనిని అధికారికంగా జూన్ లో జరిగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరీలో వెల్లడించనున్నారు.
అయితే ఇప్పటికే ఆర్థిక ప్రగతి కుంటుపడిన పాకిస్థాన్కు ఈ నిర్ణయం మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది. గ్రే లిస్ట్ నేషన్ కు అంతర్జాతీయ సమాజం నుండి వచ్చే ప్రతీ ట్రాన్సాక్షన్ లో ఎన్నో పరిశీలనలు, పర్యవేక్షణలు వుంటాయి. దీని ద్వారా ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు నిలిచి పోయే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా వివిధ దేశాల నుండి పొందే సాయంపై కూడా ఈ ప్రభావం పడుతుందంటున్నారు.
అయితే గ్రే లిస్ట్ లో పాకిస్థాన్ ను చేర్చడం ఇదే మొదటిసారి కాదు. 2009 నుండి 2015 వరకు కూడా హవాలా కారణాలతో గ్రే లిస్ట్ నేషన్గా వుంది. అయితే ప్రస్తుతం ఉగ్రవాద ఆర్థిక మూలలకు కూడా కారణమవుతుందని కూడా గ్రేలిస్ట్ లో చేర్చడం పాకిస్థాన్ కు మరింత నష్టం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ ఇక్బాల్ తప్పు పట్టారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అన్ని ఉగ్రవాదసంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ ను గ్రే నేషన్ గా ప్రకటించడం వల్ల తమ ఆర్థిక పరిస్థితి దిగజారి , ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో తమను బలహీనపరుస్తుందని అన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఈ జూన్ నాటికి చేతల్లో ఏదైనా తేడా చూపిస్తే తప్ప దాయాది దేశం గ్రే లిస్ట్ నుంచి తప్పించుకోలేదు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire