YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్

YS Jagan
x

YS Jagan

Highlights

YS Jagan: విజయవాడలో వరదలపై ప్రశ్నించిన జగన్ మోహన్ రెడ్డి

YS Jagan: చంద్రబాబు గారూ... విజయవాడలో వరదలు వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా బాధితులకు.. ఇప్పటికీ దారీ తెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా..? లేదా..? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకం వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. ఐడు కోట్ల మంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ఉందా..? ఇంత చేతగాని తనమా..? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారూ... ఇది ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేసిన ట్వీట్..

మూడు రోజుల్లో 30 సెంటీ మీటర్లకుపైగా వర్షం పడడం అసాధారణం ఏమీ కాదు. గతంలో చాలాసార్లు కురిసంది. కానీ ఈ మాదిరిగా 50 మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేశామని మీరు చెబుతున్నా.. అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం... బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడమనేది మీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఈ వరదలు వచ్చి ఎనిమిది రోజులవుతున్నా, నాలుగైదు రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణం అంటూ జగన్ ట్వీట్ చేశారు..

అసలు ఇదంతా ఎందుకు జరిగింది...? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా..? చంద్రబాబు గారూ...? శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, భారీగా వరద వస్తుందని మీకు బుధవారం రోజే అలర్ట్‌ వచ్చినా... అప్పటికే కృష్ణా నదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా, అలాగే పై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా, రెండున్నర రోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు. ఇరిగేషన్‌, రెవెన్యూ, హోం సెక్రటరీలతో రివ్యూ తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే... ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా...? అంటూ మాజీ సీఎం ప్రశ్నించారు.

ఆ రివ్యూ జరిగి ఉంటే ఇరిగేషన్‌ సెక్రటరీ వరదలపై ధ్యాస పెట్టేవారు కదా..? కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల నుంచి కొద్దికొద్దిగా నీటిని ముందుగానే విడుదల చేసి, తగ్గించుకుంటూ వస్తూ... 60 నుంచి 70 టీఎంసీల ఫ్లడ్‌ కుషన్‌ ఏర్పాటు చేసి ఉండే వారు కదా...? అప్పుడు పైనుంచి వచ్చే వరద నీటిని ఆయా జలాశయాల్లోనే సర్దుబాటు చేసి ఉంటే, పులిచింతల కింద కృష్ణా నదిలోకి వచ్చే వరద నీరు సక్రమంగా నియంత్రించి, భారీ వరదముప్పును తప్పించే వారు.. దీంతో ఇంత దారుణం జరిగి ఉండేది కాదు కదా...? పైనుంచి వచ్చిన వరదను తగ్గించకపోవడం వల్ల కృష్ణా నదిలో భారీ ప్రవాహానికి పులిచింతల దిగువ వరద కూడా తోడయింది. దీంతోపాటు బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం వల్ల ఇంత విపత్తుకు దారితీసిందన్నారు జగన్..

అదే విధంగా రెవెన్యూ సెక్రటరీ షెల్టర్ల ఏర్పాటు, నిరాశ్రయులకు వసతుల కల్పనపై దృష్టి పెట్టే వారు. హోం సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఈ షెల్టర్లలోకి షిప్ట్‌ చేసి ఉండే వారు. వీరంతా సీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఉండి ఉంటే వారితో కలిసి ఈ ముప్పును చాలా సమర్థవంతంగా, ప్రాణ నష్టంలేకుండా ఎదుర్కొనే వారు. కానీ ఇవేమీ జరగలేదని ఆరోపించారు...

పైగా మీ ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయం లోపం కనిపించింది. మీకూ.. మీ కూటమి మంత్రి నాదెండ్లకూ మధ్య జరిగిన సంభాషణపై వైరల్‌ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం... ట్రాక్టర్లు రాకపోవడం ఏంటి..?? 150 వాహనాలు మాత్రమే ఉండడం ఏంటి..? 80 వేల కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలి రోజు 15 వేల మందికి కూడా ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం చూపడం ఏంటి..? వర్షాలు ఆగి ఐదారు రోజులు అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు...? లక్షల ఉద్యోగులున్న యంత్రాంగం ఏమైపోయింది...? ఇప్పటికీ ఇంటింటికీ జల్లెడ పట్టి ఎన్యుమరేషన్‌ చేసిన దాఖలాలేవీ కనిపించడం లేదు.

మరి మీరిచ్చిన సహాయం కచ్చితంగా వారికి ఎలా చేరుతుంది...? ఎమర్జెన్సీ సేవలను ఎలా అందించగలుగుతారు...? విపత్తుల సమయంలో అసమాన సేవలందించిన, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది వాస్తవం కాదా? అని జగన్ ప్రశ్నించారు.

బాధితులకు బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులు ఇవ్వడం ఏపీలో ఇదే తొలిసారి అన్నట్టుగా, దాన్నే ఓ పెద్ద ప్యాకేజీగా చూపించి మీరు ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వరదలవల్ల బాధితులైన వారికే కాదు... వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా ఈ రేషన్‌ సరుకులను ఒక్క రోజులో ఎండీయూ వాహనాల్లో డోర్‌ డెలివరీ చేశాం.

అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్లు ఆనందంతో ఇంటికి వెళ్లేలా చేశాం. కానీ విజయవాడలో పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా... మీరిస్తున్న సరుకులు అరకొరే... తీరా అవి కూడా డోర్‌ డెలివరీ పద్ధతిలో చేరడం లేదు. తీసుకున్న ఆ కొద్దిమంది, ఇళ్ల నుంచి నీళ్లలో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఇంకా వారిని బాధపెట్టడం కాదా...? అంటూ ప్రశ్నించారు జగన్..

కుటుంబ సభ్యులను కోల్పోయి ఒకరు, వ్యాపారాలు తుడిచి పెట్టుకుపోయి మరొకరు... ఉపాధిని కోల్పోయి ఇంకొకరు.. ఇల్లు ధ్వంసమై మరొకరు... ఇలా విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా ఇలాంటి దీనగాథలే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వారికి ఉదారంగా సహాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా చంద్రబాబు గారూ...? ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం... వరద బాధితులకు సహాయం చేయడంలో బీద అరుపులు ఎందుకు..? చివరకు విరాళాలు ఇవ్వాలని డ్వాక్రా అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి కూడా వసూళ్లకు దిగడం ఏంటి...? బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయండి... మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తామని మాజీ సీఎం గజన్ హెచ్చరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories