Pakistan: పాకిస్థాన్ క్రికెట్కు ఇది సంకేతమా? బాబర్ ఉన్నా స్టేడియాలు ఖాళీ!
Pakistan: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్లో ఊహించని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు క్రికెట్ను ప్రాణంగా ప్రేమించే పాకిస్థాన్ అభిమానులు ఇప్పుడు స్టేడియాలకు రావడం లేదు.

Pakistan: పాకిస్థాన్ క్రికెట్కు ఇది సంకేతమా? బాబర్ ఉన్నా స్టేడియాలు ఖాళీ!
Pakistan: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్లో ఊహించని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు క్రికెట్ను ప్రాణంగా ప్రేమించే పాకిస్థాన్ అభిమానులు ఇప్పుడు స్టేడియాలకు రావడం లేదు. పేషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన 11వ మ్యాచ్కు కరాచీలోని నేషనల్ స్టేడియం పూర్తిగా ఖాళీగా దర్శనమిచ్చింది. మైదానంలో అభిమానుల కంటే భద్రతా సిబ్బంది ఎక్కువగా ఉండటం గమనార్హం. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు క్రీడకు దూరమవుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ మ్యాచ్లో పేషావర్ జల్మీ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్ల్లో విఫలమైన పేషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్లో 41 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. అయితే, బాబర్ ఆడుతున్నా కూడా స్టేడియానికి అభిమానులు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పీఎస్ఎల్కు ఆదరణ కరువు?
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సామ్ బిల్లింగ్స్ ఇటీవల ఐపీఎల్ను ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్గా అభివర్ణించాడు. పీఎస్ఎల్తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్ల కంటే ఐపీఎల్ ఎంతో గొప్పదని అతడు పేర్కొన్నాడు. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మింగుడు పడని విషయంగా ఉంది.
మొత్తం 34 మ్యాచ్లు జరగనున్న పీఎస్ఎల్ టోర్నమెంట్ను ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీసీబీ నిర్వహించడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఐపీఎల్కు తమ లీగ్ పోటీ ఇస్తుందని పీసీబీ భావించింది. అయితే, మొదటి మ్యాచ్లకు కొంతమంది ప్రేక్షకులు వచ్చినా, 11వ మ్యాచ్ వచ్చేసరికి స్టేడియాలు వెలవెలబోతున్నాయి.
భద్రతా సిబ్బంది ఎక్కువ.. ప్రేక్షకులు తక్కువ!
కొద్ది రోజుల క్రితం ఒక పాకిస్థానీ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ కరాచీలో పీఎస్ఎల్ మ్యాచ్ల కోసం 6700 మంది భద్రతా సిబ్బందిని మోహరించారని రాశాడు. అయితే, కరాచీలో జరిగిన మ్యాచ్కు కేవలం 5000 మంది మాత్రమే ప్రేక్షకులు వచ్చారు. అంటే, భద్రతా సిబ్బంది కంటే 1500 మంది తక్కువగా అభిమానులు మ్యాచ్ చూడటానికి వచ్చారు.
బాబర్ ఆజమ్ జట్టు పేషావర్ జల్మీ ఈ మ్యాచ్కు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కరాచీ కింగ్స్ ఈ మ్యాచ్కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అయితే, స్టేడియాలకు అభిమానులు రాకపోవడం పాకిస్థాన్ క్రికెట్కు ఆందోళన కలిగించే విషయం.