Pahalgam Tourists: ఉగ్రదాడుల తర్వాత కూడా ఆగని టూరిస్టుల తాకిడి.. పహల్గాంకు పోటెత్తుతున్న పర్యాటకులు!
Pahalgam Tourists: పహల్గాం మళ్లీ తన పాత శోభను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండగా, స్థానికులు పర్యాటకులకు గట్టి మద్దతుగా నిలుస్తున్నారు.

Pahalgam Tourists: ఉగ్రదాడుల తర్వాత కూడా ఆగని టూరిస్టుల తాకిడి.. పహల్గాంకు పోటెత్తుతున్న పర్యాటకులు!
Pahalgam Tourists: పహల్గాం లోయ మళ్లీ జీవంతో నిండుతోంది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినా, అక్కడి సుందర దృశ్యాలకు ఆకర్షితులై దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు మళ్లీ అక్కడికి తరలివస్తున్నారు. పహల్గాం, బైసరన్ లోయల వైపు టూరిస్టులు మళ్లీ అడుగులు వేస్తుండగా, ప్రదేశం మళ్ళీ సాధారణ స్థితికి చేరుతోంది.
కొలకతా, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చిన పర్యాటకులు అక్కడి భద్రతపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భయాలు ఉన్నా, తమ పర్యటనను కొనసాగిస్తున్నామని చెప్పారు. "కశ్మీర్లో ఇప్పుడు భద్రత చక్కగా ఉంది, ప్రతిదీ సజావుగా సాగుతోంది" అని కొలకతాకు చెందిన ఓ పర్యాటకుడు పేర్కొన్నాడు. సూరత్కు చెందిన మోహమ్మద్ అనాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆర్మీ, ప్రభుత్వం, స్థానికులు తమకు భద్రత కల్పించారని, మొదట భయంతో వెళ్లిపోవాలని అనుకున్నా, స్థానికుల ధైర్యంతో పర్యటన కొనసాగించినట్టు వెల్లడించాడు.
విదేశీ పర్యాటకులు కూడా కశ్మీర్లో భద్రతపై నమ్మకంతో ఉన్నారు. క్రోయేషియాకు చెందిన పర్యాటకులు అక్కడ 3-4 రోజులు గడిపారని, ఎలాంటి భయం లేదా అసౌకర్యం అనిపించలేదని చెప్పారు. "ప్రపంచంలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగే అవకాశముంది. కానీ ఇక్కడ ప్రజలు ఎంతో ఆత్మీయంగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు" అని వారు వివరించారు. ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్లో పాక్ ఆధారిత ఉగ్రసంస్థలు జరిపిన కాల్పుల్లో మృతులు సంభవించాయి. దీంతో కాశ్మీర్ను వీడేందుకు పెద్దఎత్తున టూరిస్టులు బయలుదేరిపోయారు.
ఈ పరిణామం వల్ల పర్యాటక రంగం దెబ్బతింటుందనే ఆందోళనతో, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పర్యాటకులను భరోసా ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. "ఈ సమయంలో కాశ్మీర్ను వదిలిపెడితే ఉగ్రవాదులకు విజయమే లభిస్తుంది" అని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా, బాలీవుడ్ నటుడు అతుల్ కులకర్ణి కూడా ఆదివారం కాశ్మీర్ చేరుకొని ప్రజలను పెద్దఎత్తున కాశ్మీర్ సందర్శించాలంటూ పిలుపునిచ్చాడు. ముంబై నుంచి శ్రీనగర్కు వచ్చిన విమానం ఖాళీగా ఉండటాన్ని ఆయన బాధతో ప్రస్తావించారు.