
Manchu Manoj: ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో గత కొన్నాళ్లుగా వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం చోటుచేసుకున్న పలు పరిణామాల ద్రుష్ట్యా బుధవారం ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన గేటు ముందే బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కాగా తన కారు పోయిందని మంగళవారం మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జైపూర్ వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని ఆయన సోదరుడు విష్ణు ఇదంతా చేయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈనెల 1న మా పాప పుట్టినరోజు సందర్భంగా జైపూర్ వెళ్లాను.
నా సోదరుడు విష్ణు 150 మందితో జల్ పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామాగ్రి ధ్వంసం చేశారు. మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డుమీద వదిలేశారు. నా కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారు. జల్ పల్లిలో నా భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇస్తే..ఆ కారు విష్ణు ఇంట్లో ఉందని గుర్తించారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదపూర్ కు పంపించారని మనోజ్ మీడియాతో చెప్పారు.