Dolo 650: డోలో 650ని జెమ్స్లాగా వాడేస్తున్న భారతీయులు.. వైరల్ అవుతోన్న పోస్ట్
Dolo 650 Overuse in India: జ్వరం వచ్చినా, కాస్త ఒళ్లు నొప్పిగా అనిపించినా వెంటనే చాలా మంది చేసే పని డోలో 650 వేసుకోవడం.

Dolo 650: డోలో 650ని జెమ్స్లాగా వాడేస్తున్న భారతీయులు.. వైరల్ అవుతోన్న పోస్ట్
Dolo 650 Overuse in India: జ్వరం వచ్చినా, కాస్త ఒళ్లు నొప్పిగా అనిపించినా వెంటనే చాలా మంది చేసే పని డోలో 650 వేసుకోవడం. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లో సులభంగా ట్యాబ్లెట్లను ఇవ్వడంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ను గాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆరోగ్య నిపుణుడు పళణియప్పన్ మణికం హైలైట్ చేస్తూ.. 'భారతీయులు డోలో 650ను క్యాడ్బరీ జెమ్స్లా తీసుకుంటున్నారు' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
డోలో-650ను భారతదేశంలోని డాక్టర్లు సాధారణంగా జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, తేలికపాటి నొప్పులు కోసం సూచిస్తారు. అయితే ఈ ట్యాబ్లెట్ పరిమితంగా తీసుకుంటే సురక్షితమైందని నిపుణులు చెబుతున్నా, ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదమని చెబుతున్నారు. ప్యారాసెటమాల్ ఎక్కువగా తీసుకుంటే కాలేయంపై దుష్ప్రభావం చూపవచ్చు, కాబట్టి వైద్యుల సలహాతోనే వాడాలి.
కోవిడ్ సమయంలో ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే తాత్కాలిక దుష్ప్రభావాల్ని తట్టుకోవటానికి డాక్టర్లు డోలో 650ను సూచించడంతో, దీని వినియోగం బాగా పెరిగింది. డోలో-650 ప్యారాసెటమాల్ మీద ఆధారపడి తయారు చేసే ఔషధం. ఇది జ్వరం, వాపు వంటి లక్షణాలకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్లను నిరోధిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి జ్వరాన్ని కంట్రోల్ చేస్తుంది.
Forbes నివేదిక ప్రకారం, డోలో 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ కోవిడ్ ప్రారంభమైన 2020 నుంచి రూ. 350 కోట్ల టాబ్లెట్లు అమ్మింది. ఒకే ఏడాదిలో రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది. కోవిడ్కు ముందు (2019) వార్షికంగా 7.5 కోట్ల స్ట్రిప్స్ అమ్ముడయ్యేవి. 2021 చివరికి ఇది 14.5 కోట్ల స్ట్రిప్స్కు చేరింది అంటే రెండు రెట్లు పెరిగిందన్నమాట. డోలో 650 ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. వైద్యుడి సలహా మేరకు, సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. ప్రతి చిన్న నొప్పికీ టాబ్లెట్ వేసేసుకుంటే శరీరంలోని అవయవాలపై ప్రభావం పడడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.