Tahawwur Rana after 26/11 Attacks: భారతీయులకు అలా జరగాల్సిందే.. ముంబై దాడులపై రాణా

Tahawwur Rana after 26/11 Attacks: భారతీయులకు అలా జరగాల్సిందే.. డేవిడ్ హెడ్లీతో ముంబై దాడులపై రాణా సంభాషణ
26/11 ముంబై దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను అమెరికా పోలీసు కస్టడీ నుండి ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాణా ఢిల్లీకి చేరుకోవడంతోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతడిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఎన్ఐఏ రాణాను ప్రశ్నిస్తోంది.
రాణాను భారత్ కు అప్పగించే క్రమంలో అమెరికా న్యాయ శాఖ కొన్ని కీలక వివరాలు వెల్లడించింది. అమెరికా అదుపులో ఉన్న సమయంలో విచారణ సమయంలో రాణా ఇచ్చిన వాంగ్మూలం, వెల్లడించిన సమాచారాన్ని అమెరికా భారత్ తో పంచుకుంది.
అమెరికా చెప్పిన వివరాల ప్రకారం ముంబై దాడుల తరువాత రాణా తన చిన్ననాటి స్నేహితుడు, ముంబై దాడుల మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారతీయులకు అలా జరగాల్సిందేనని డేవిడ్తో చెప్పాడు. ఈ దాడుల్లో భారత సైనికుల చేతిలో హతమైన 9 మంది ఉగ్రవాదులకు పాకిస్థాన్ మిలిటరీ సైనికులకు ఇచ్చే అత్యునత పురస్కారం నిషాన్-ఏ-హైదర్ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్లో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు గౌరవ సూచకంగా అక్కడి ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారమే నిషాన్-ఏ-హైదర్. డేవిడ్ హెడ్లీ, రాణా మధ్య జరిగిన సంభాషణను సీక్రెట్గా రికార్డు చేయడం ద్వారా రాణా వ్యాఖ్యలు బయటికొచ్చినట్లు తెలుస్తోంది.
166 మందిని బలి తీసుకున్న ఆనాటి ఘటన భారత చరిత్రలో ఒక మానని గాయంగా మిగిలిపోయింది.
2020 లో అమెరికా తహవ్వూర్ హుస్సేన్ రాణాను అరెస్ట్ చేసింది. అప్పటి నుండి రాణాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ కోరుతూనే ఉంది. అమెరికా - భారత్ మధ్య ఎక్ట్రాడిషన్ ఒప్పందం ఉన్నందున, భారత్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రాణాను అప్పగించాలని అమెరికా సుప్రీం కోర్టులో భారత్ ఎక్స్ట్రాడిషన్ పిటిషన్ దాఖలు చేసింది. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ విచారణ ఎట్టకేలకు తుది దశకు చేరుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా అతడిని భారత్కు అప్పగించింది.