Trump: పహల్గాం దాడి చెత్తపని..పరిష్కారం భారత్ -పాక్ చేతుల్లోనే..ఇలా అనేశాడేంటీ?

Donald Trump: అరబ్ దేశాల సంపదను చూసి షాక్ అయిన ట్రంప్
Trump: జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలోని పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ ల మధ్య కాశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతుందన్నారు. అయితే ఈ అంశాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని తెలిపారు.
రోమ్ పర్యటనకు బయలుదేరిన ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు ట్రంప్. ఈ సందర్భంగా భారత్, పాక్ ఉద్రిక్తతలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆ రెండు దేశాలు నాకు చాలా దగ్గర. కాశ్మీర్ విషయంలో భారత్, పాక్ ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్తపని. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. అయితే ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడిన విషయం తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫోర్స్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.