నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే రాజ్ థాకరే నోటికి ఎట్టకేలకు సుప్రీం కోర్టు కళ్లేంవేసింది. ఇతర వర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రాహుల్ దుల్హనియా లేజాయేగా ఎపిసోడ్ ఉత్కంఠకు తెరదించింది. వధువు కోసం రాహుల్ మహాజన్ చేసిన వేట ఎట్టకేలకు ఫలించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాహుల్ మహాజన్ పెళ్లికూతురిని ఎంపిక చేసుకున్నాడు. 15మంది వధువులను పక్కకు నెట్టి బెంగాల్ మోడల్ దింపీ గంగూలిని వరించాడు. ఉత్కంఠభరితంగా సాగిన రియాలిటీ షో చివరి ఎపిసోడ్లో ఫైనల్ కు చేరుకున్న నికున్జ్ మాలిక్, హర్ ప్రీత్ ఛాబ్రాలను వెనక్కునట్టి దింపీ గంగూలి రాహుల్ మనసు గెలుచుకుంది. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం రాహుల్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదో గొప్ప అనుభూతి. ఆనందంతో పాటు ఉద్విగ్నతకు లోనవుతున్నానని రాహుల్ చెప్పాడు. అర్థాంగిని సంతోషంగా ఉంచేందుకు చేయాల్సినవన్నీ చేస్తానని తెలిపాడు. తండ్రి ప్రమోద్ మహాజన్ మరణం, మరోవైపు చిన్ననాటి స్నేహితురాలు శ్వేతతో విడాకుల వ్యవహారం రాహుల్ ను కృంగదీసింది. రాఖీ సావంత్ రియాలిటీ షో రాహుల్లో కొత్త ఆశలకు ఊపిలూదింది. రాహుల్ దుల్హనియా లేజాయేగాతో స్వయంవరం వేట ప్రారంభించాడు. ఎంతో ఉత్కంఠగా సాగిన షోలో చివరికి దింపీ గంగూలిని వరించాడు. మాల్దీవుల్లో హనీమూన్ కు ప్లాన్ చేస్తున్న రాహుల్ తన పాస్ పోర్టును ఇప్పించాలని ఢిల్లీ కోర్టును కోరాడు. మరోవైపు ఇలాంటి రియాలిటీ షోలు మహిళల పరువును మంటగలుపుతున్నాయంటూ జాతీయ మహిళా కమీషన్ మండిపడింది. వీటిని నియంత్రించేందుకు ఓ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
బేగంపేట విమానాశ్రయంలో జరుగుతోన్న అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు రేపటి నుంచీ అందరినీ ఆహ్వనించనున్నారు. ఆదివారంతో ముగిసే ఈ షోను సందర్శంచడానికి టికెట్ ధరను 200రూపాయిలుగా నిర్ణయించారు. నేరుగా విమానాశ్రయంలోగానీ, లేక ఆంధ్రాబ్యాంక్ శాఖల్లోకానీ ఈ టికెట్లను పొందవచ్చని ఇప్పటికే పౌరవిమానయానశాఖ ప్రకటించింది. పెద్దమొత్తంలో సందర్శకులు ఇక్కడకు వచ్చే అవకాలు ఉండడంతో తోపులాటలు జరగకుండా భారీ పోలీసు బలగాలు ఇక్కడకు చేరుకున్నాయి. పార్కింగ్ను ఇక్కడ అనుమతించని బేగంపేట విమానాశ్రయం. దీని కోసం పక్కనే ఉన్న వెస్ట్లీ కాలేజీలో ఈ సదుపాయన్ని ఏర్పాటుచేసింది.
అప్రకటిత కరెంటు కోతపై విపక్షాలు గన్ పార్క్ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కరెంటు కోతలను నివారించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ సక్రమంగా అమలుకాకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూడాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి రోశయ్య కోరారు. మైనార్టీల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలన్నారు. పంట రుణాల టార్గెట్ను పూర్తి చేసి, కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
ఎబివిపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి రోశయ్య ఇంటిని చుట్టుముట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలరషిప్పులు ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఓయూలో విధ్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమని టీడీపీ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి ,ఎర్రబెల్లి దయాకర్రెడ్డి అన్నారు. రోజుకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కోదండరాంకు చంద్రబాబును విమర్శించే హక్కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని టార్గెట్ చేసేందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్లు చంద్రబాబును విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు.
తెలంగాణ కోసం ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లా హన్మకొండలో తెలంగాణ కోసం సునీల్ అనే జర్నలిస్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకృష్ణ కమిటీ కాలయాపన చేసి ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజాశక్తి దినపత్రికలో సుబేదారి విలేకరిగా పనిచేస్తోన్న సునీల్ అత్మహత్య జర్నలిస్టులను దిగ్బ్రాంతికి గురిచేసింది. తెలంగాణ ఏర్పాటు కోసం జర్నలిస్ట్ సునీల్ ఆత్మహత్యకు పాల్పడడంతో తెలంగాణ వాదులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో స్వల్ప వ్యవధిలో ప్రమాదాల బారిన పడి కొందరు, ఆత్మహత్యలకు పాల్పడి మరికొందరు చనిపోతున్నారు. అంతే ఇంకేముంది తమ ఊరికేదో అరిష్టం జరుగుతోందని దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయని వదంతులు వ్యాపించాయి. మూఢనమ్మకాల పిచ్చిలో పడ్డ గ్రామస్తులు శాంతి పూజల పేరిట మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారు. గ్రామంలోని ఆరేటి పోచమల్లు అనే యువకుడు జనవరి 25న తెలంగాణ కోసం వంటిపై కిరోసిన్ పోసుకుని చనిపోయాడు. పోచమల్లు తమ్ముడు గంగాధర్ కూడా ఫిబ్రవరి 9న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ మరణాలకు తోడు సోపరి సందీప్ అనే మరో యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామస్తుల్లో రకరకాల భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామంలో జరుగుతున్న సంఘటనలకు ఊరిలోని పోచమ్మ ఆలయం ఎదురుగా ఉన్న వేప చెట్టును కొన్నేళ్ళ క్రితం నరికివేయటమే కారణమని కొందరంటుంటే చనిపోయిన వాళ్ళు దెయ్యమై తిరుగుతున్నారని మరికొందరు భయపడుతున్నారు. మరోవైపు వేసవికాలం వస్తుండటంతో గ్రామంలో చాలామందికి జ్వరాలు వస్తున్నాయి. ఊరికి అరిష్టం జరుగుతోందన్న మూఢ నమ్మకంగ్రామస్తుల్లో పాతుకుపోయింది. దీంతో పోచమ్మ గుడిలో ఎనిమిది మేకల్ని బలిచ్చారు. ఏదేమైనా మనిషిలోని భయమే అతన్ని భయపెట్టే దెయ్యమవుతుంది. ఇకనైనా అధికారులు, జనవిజ్ఞాన వేదిక వారు ఈ ఊరి ప్రజల్లో భయాల్ని పోగొట్టాలని మరికొందరు కోరారు.
పెరూలో సాకర్ అభిమానులు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ హింసాత్మకంగా మారింది. స్థానికలీగ్ నుంచి ఓ ఫుట్బాల్ జట్టును తొలగించడంతో అభిమానులు నిరసనగా ర్యాలీ తీశారు. అయితే పోలీసుల అత్యుత్సాహంతో శాంతియుతంగా సాగుతున్న ప్రదర్శనకాస్తా రసాభాసగా మారింది.
తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తో కలిసి పనిచేస్తామంటున్న పాక్ మాటలు కల్లబొల్లికబుర్లుగానే ఉన్నాయి. ముంబయి దాడుల్లో కీలకపాత్ర పోషించిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ విషయంలో ఇది రుజువవుతోంది. తాజాగా భారత్కు వ్యతిరేకంగా హఫీజ్ చేపట్టిన ఓర్యాలీకి పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. ఇక ర్యాలీలో రెచ్చిపోయిన హఫీజ్ పాకిస్తాన్ నదీజలాలను భారత్ దోచుకుంటుందంటూ ప్రేలాపనలు చేశాడు. కాశ్మీర్లో భారత్ ఆగడాలను అడ్డుకోవడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందన్నాడు. పాకిస్తాన్ విషయంలో భారత్ చేస్తున్న కుట్రలు అంతర్జాతీయ సమాజం కళ్ళకు కనిపించడం లేదని ఆరోపించాడు.
మతకల్లోలాలతో నైజీరియా అట్టుడుకుతోంది. తాజాగా జరిగిన అల్లర్లలో దాదాపు ఐదు వందల మంది చనిపోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. చనిపోయిన వారి మృత దేహాలను సామూహికంగా పాతిపెట్టారు. జనవరిలో జరిగిన ఘోరాల్నుంచి తేరుకుంటున్న నైజీరియన్లు తాజా అల్లర్లతో వణికిపోతున్నారు.
అభ్యుదయ కవిత్వంతో మహాకవి శ్రీశ్రీ 20వ శతాబ్దపు సాహిత్యాన్ని శాసించారని ప్రముఖ గాయని జానకి అన్నారు. శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో శ్రీశ్రీ జీవితం, దృక్పథం, సాహిత్యం పై సదస్సు జరిగింది. మహాప్రస్థానం ఇప్పటికీ పాఠకుల హృదయాలను కదిలిస్తోందని సదస్సులో పాల్గొన్న వక్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ సతీమణి సరోజ పాల్గొన్నారు.
బుర్రకు పదునుపెట్టాలే కానీ, గుమ్మడికాయ బుర్రలతో కూడా అద్భుతమైన కళాఖండాలు రూపొందించ వచ్చంటున్నాడో ఆర్టిస్ట్. జార్ఖండ్ రాష్ట్రం దేవ్గఢ్ కు చెందిన మర్కాండే ఏదైనా వెరైటీగా చేయాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలోనే గుమ్మడికాయ బుర్రలను మర్కాండే మలిచిన తీరు పలువురి ప్రశంసలందుకుంటోంది.
నిన్నటి తరం నేపథ్య గాయని పి.సుశీల తనకు భారతరత్న అవార్డు దక్కుతుందన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. కలియుగదైవం గోవిందుడే తనకు ఆ పురస్కారం దక్కేలా చేస్తాడని ఆమె అన్నారు. మహిళాదినోత్సవం నాడు తిరుపతి వచ్చిన ఆమె తన గానమాధుర్యంతో అభిమానులను అలరించారు.