పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించటం సాథ్యం కాదని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. లోక్సభలో బిజేపీ ఎంపీ యశ్వంత్ సిన్హా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రొలియం ఉత్పత్తుల ధరలను తగ్గించలేమని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.
గుజరాత్ అల్లర్ల కేసులో సిట్ నుంచి సమన్లు అందుకున్న మోడీకి బీజేపీ అగ్రనాయకత్వం మద్ధతు తెలిపింది. అసలు మోడీ ఎలాంటి తప్పూ చేయలేదని ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. న్యాయ విచారణకు మోడీ అన్నిరకాలుగా సహకరిస్తారని ప్రకటించారు. రాబోయే ఎన్నికలలో ప్రథాని అభ్యర్థి ఎవరనేదీ పార్టీ సీనియర్ నాయకులు నిర్ణయిస్తారన్న గడ్కరీ, మోడీ ప్రధాని పదవికి అర్హుడని చెప్పారు. గుజరాత్ను అన్నిరంగాల్లో మోడీ అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. గుజరాత్ అల్లర్లు దురదృష్టకరమనీ, కాకపోతే అవి యాక్షన్కు రియాక్షన్ అని అన్నారు. మోడీ ఎటువంటి తప్పూ చేయనప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే తెలంగాణ జాతర దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైంది. గ్రామదేవతలు, పోతురాజులు, బోనాలు, బతుకమ్మ, కోయదొరల ఆటలు, సమ్మక్క సారక్క గద్దెలు, పీర్ల పండుగ సంబరాలు, కళాకారుల ఆటపాటలతో జాతర ప్రాంగణం మార్మోగిపోతోంది.
రెండు రోజుల పర్యటతో భాగంగాటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. వరద ముంపు బాధితుల్ని ఆయన పరామర్శించారు. వరద సహాయ చర్యల్ని బాధితుల్ని అడిగి తెల్సుకున్నారు. జిల్లాలోని రాజోలిలో పర్యటించిన ఆయన వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ విషయంపై అసెంబ్లీలో సర్కార్ను నిలదీస్తానని చెప్పారు. అఖిలపక్ష నేతలో పర్యటించిన ఆయన తాగునీరు అందించటంలో సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. ఎన్టీఆర్ మెమోరిల్ ట్రస్ట్ నుంచి నాలుగు లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మరోవైపు బాబు టూర్లో అపసృతి దొర్లింది. కాన్వాయ్లోని ఓ వాహనం గుంతలో పడటంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొన్నాయి.
రాష్ట్ర రహదారులు నెత్తురోడాయి. ప్రకాశం, కడప జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది చనిపోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా నాలుప్పలపాడు మండలం మద్దిరాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే చనిపోయారు. మరో 10మందికి తీవ్రగాలయ్యాయి. కొత్తపట్నం మండలం రాజుపాలెం నుంచి మద్దిరాలకు పనికోసం వచ్చిన కూలీలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. రోడ్డు దాటు తున్న వారిపై వేగంగా వస్తున్న లారీ దూసుకు వెళ్లింది. అటు కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5మంది చనిపోయారు. పదిమంది గాయపడ్డారు. పుల్లంపేట, రాజంపేట రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకోన్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు ఓబులపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలియజేయాలని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. దీనిపై ఆ పార్టీ అధినేత్రి సోనియా ప్రకటన చేయాలని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఆ తర్వాతే తమ అధినేత చంద్రబాబుతో ప్రకటన చేయిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పై చిత్తశుద్ది లేదని విమర్శించిన ఎర్రబెల్లి తెలంగాణ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దమని ప్రకటించారు. తాము ఇప్పటికీ జేఏసీ లోనే ఉన్నామని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన టెక్ రమణ డైరీ ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రులోని ఓ ఇంట్లో వరంగల్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4వేలకు పైగా గ్రెనెడ్లు, తుపాకుల విడిభాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
విశాఖ బీచుల్లో రోజురోజుకు పెరుగుతున్న మరణాలను అరికట్టేందుకు ప్రాజెక్టు తయారవుతోంది. బీచ్ రోడ్ సేఫ్టీ పేరుతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుతో భద్రత పటిష్టం అవుతుందని గ్రేటర్ విశాఖ అధికారులన్నారు. విశాఖలో ఎక్కువగా పర్యటకులు సందర్శించే ప్రాంతాలు తెన్నేటిపార్కు, రుషికొండ, యారాడ, రామకృష్ణ బీచ్ లు. ఈ ప్రాంతాల్లోని సముద్రపు నీళ్లలో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి భద్రత లేకుండా పోతోంది. టూరిస్టులు మృత్యువు ఒడిలోకి చేరుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2009లో సుమారు 15మంది ఆర్కే బీచ్ లో చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సముద్రపు స్నానానికి వెళ్లిన వారికి తగిన భద్రత కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, మెరైన్ పోలీస్, ఎపి టూరిజం సహా ఎన్జీవోలు, వివిధ ప్రైవేటు సంస్థల సహకారంతో బీచ్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. తగిన భద్రత లేకపోవడం వల్లే బీచుల్లో మరణాల సంఖ్య పెరుగుతోందని, సందర్శకుల భద్రత కోసం తగిన చర్యలు చేపట్టడాన్ని బోట్ ఆపరేటర్లు స్వాగతించారు. బీచ్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్టుపై స్థానిక ప్రజలు, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బంగారం పేరుతో నకిలీ నాణేలు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ జిల్లా వీణవంక పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని మరో సభ్యుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నకిలీ నాణాల ముఠాతో మోసపోయిన బాధితులు ఖాకీలను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు చల్లూరులో దందా నిర్వహిస్తున్న కేడీలను అదుపులోకి తీసుకున్నారు.
గ్రీస్ లో ట్రేడ్ యూనియన్ నిర్వహిస్తున్న సభ ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలపై యూనియన్ నేతలు ప్రసంగిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యూనియన్ నాయకులకు మధ్య వివాదం చెలరేగింది. చినికి చినికి గాలివానలా మారిన ఈ వివాదం ఉద్రిక్తలకు దారితీసింది. పోలీసులు టిన్ గ్యాస్, పెట్రోల్ బాంబులతో ఆందోళనకారుల చెదరగొట్టారు.
దొంగలు ఇంట్లోపడితే నోటికి తాళం వేసేసి ఇనప్పెట్టె కీ అప్పజెప్పేస్తారు. అయితే ఏడేళ్ళ చిన్నారి మాత్రం దొంగల ఆటకట్టించాడు. కాలిఫోర్నియా నోర్వాక్ లో ఉంటున్న కార్లోస్ ఇంటిపై ముగ్గురు దొంగలు దాడిచేసి తల్లిదండ్రుల్ని కట్టేశారు. అయితే ఏమాత్రం బెదరని కార్లోస్, చెల్లిని తీసుకుని బాత్రూమ్ లో నక్కాడు. దొంగల విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకు ఫోన్ వెళ్ళిందన్న విషయం తెలుసుకున్న దొంగలు కార్లోస్ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి పరారయ్యారు. అనంతరం చిచ్చరపిడుగు కార్లోస్ కు పోలీసులు చిన్నపాటి సన్మానసభ ఏర్పాటుచేశారు. సన్మానం చివర్లో బాత్రూమ్లో హీరో కార్లోస్ పక్కనున్నదెవరంటూ అనుమానం వ్యక్తం చేశారు. అంతే సీరియస్ అయిపోయిన మన హీరో పక్కనున్నది తన చిన్నిచెల్లెలే నంటూ సమాధానం ఇచ్చాడు.
ఒబామాకు శాంతి బహుమతి ప్రకటించిన నోబెల్ కమిటీ బహుమతి మొత్తాన్ని ఇవ్వడం మరచిపోయింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ అవార్డుకుగాను ఒబామాకు ఆరుకోట్ల 35లక్షల రూపాయల బహుమతి ఇవ్వవలసి ఉంది. ఒబామా పురస్కారం అందుకుని మూడునెలలు గడుస్తున్నా డబ్బు మాత్రం ఇంకా అందుకోలేదు. ఒబామా ఇప్పటి వరకు నోబెల్ కమిటీని ఈ మొత్తం గురించి అడగలేదట. ఈ బహుమతి మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు పురస్కారం అందుకున్న సమయంలో ఒబామా ప్రకటించారు.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ త్వరలో ఎక్స్ ట్రీమ్ సిటీ అనే చిత్రంలో హాలీవుడ్ రొమాంటిక్ స్టార్ లియోనార్డ్ డి కాప్రియోతో కలిసి నటించనున్నాడు. థ్రిల్లర్ కథాంశంతో రూపోందుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
చిన్న సినిమాలకు ఎదురౌతున్న అటంకాలు అధిగమించినపుడే విజయాలు సాధ్యమవుతాయని యువనటుడు ఉదయకిరణ్ అన్నారు. ప్రేక్షకుల ఆధరణతోనే ఇంతకాలం సినీపరిశ్రమలో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో రెండు కొత్త చిత్రాలలో నటిస్తున్నానని చెప్పారు. అవకాశం వస్తే తేజ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమని ఉదయ్ కిరణ్ చెప్పారు.
బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించిన త్రిఇడియట్స్ ఇపుడు ఆస్ట్రేలియా ప్రేక్షకుల్ని అలరించనుంది. తర్వలో మెల్బోర్న్ లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో త్రిఇడియట్స్ ను ప్రదర్శించ నున్నారు. ఇటీవల భారతీయులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య స్నేహాపూరిత వాతవరణాన్ని నెలకొల్పేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో మన త్రిఇడియట్స్ ఆస్ట్రేలియాలోనూ అల్లరి చేయనున్నారు.