భారత్పై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. పన్నాగాలు పారకపోవడంతో సరికొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. లక్ష్య సాధనకోసం మహిళా ఉగ్రవాదులను రంగంలోకి దించుతున్నారు. జమ్మూలో హఫీసాబాను అనే మహిళా ఉగ్రవాదిని అరెస్ట్ చేయడంతో కుట్ర బట్టబయలైంది. 27ఏళ్ళ హఫీసా హుజీ సంస్ధలో తీవ్రవాద శిక్షణ పొందిందని పోలీసులు తెలిపారు.
మావోయిస్టులు మళ్ళీ రెచ్చిపోయారు. 72 గంటల బంద్ సందర్భంగా రైల్వే లైన్లు పేల్చేశారు. జార్ఖండ్ సరైకాలా దగ్గర రైల్వే ట్రాక్ పేల్చిన ఘటనలో రెండు గూడ్సు బోగీలు పట్టాలు తప్పాయి. అలాగే బీహార్ దర్బారాలో రైల్వే ట్రాక్ను పేల్చేశారు.
ఉద్యోగం పర్మినెంట్ చేయమని వారు ఎన్నిరకాలుగా మొరపెట్టుకున్నా ప్రభుత్వం చెవికెక్కలేదు. తమ వేదనని ఇంకెలా తెలియచేయాలో అర్ధంకాని ఇద్దరు మహిళాటీచర్లు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. గుండెల్ని పిండేసే ఈ సంఘటన పంజాబ్లో జరిగింది.
ఇంజనీరింగ్, మెడికల్ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నట్లు ఉన్నతవిద్యామండలి ప్రకటించింది. 22తేదీ నుంచి దరఖాస్తులను విక్రయిస్తామని చెప్పింది. మే 30వ తేదీన ఎంసెట్ ఉమ్మడి పరీక్ష జరగనుంది.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు గవర్నర్ నరసింహన్ పలు సూచనలు చేశారు. ప్రతి మూడు నెలలకు గవర్నర్కు విశ్వవిద్యాలయాల నివేదికలు అందించాలన్నారు. యూనివర్సిటీల వార్షిక ప్రణాళిక దెబ్బతింటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రోశయ్య కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అవసరాలను ప్రణబ్ ముఖర్జ్జీకి వివరించినట్లు సీఎం చెప్పారు. కరువు, వరద విపత్తులకు కేంద్రం ప్రకటించిన మొత్తాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రి మమతా బెనర్జీని కోరానని సీఎం అన్నారు. మమత కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ధరల పెరుగుదలకు ఏఏ పరిస్థితులు దారి తీశాయో కేంద్రానికి వివరించినట్లు ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. వాటిని అరికట్టేందుకు తీసుకుంటన్న చర్యలను వివరించి సహాయాన్ని కోరామన్నారు. ఎపిఎల్ ఫ్యామిలీస్ కిచ్చే స్టాక్ ని రిలీజ్ చేయాలని విన్నవించామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసే సూచనలు, ఆదేశాలు తమకు శిరోధార్యమన్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్ళిన రోశయ్య ఇవాళ సాయంత్రం హైదరాబాద్ తిరిగొస్తారు.
నల్లగొండ జిల్లా చౌటుప్పుల్ మండలం దండుమల్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనం ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కొయ్యగూడెం వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు.
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఓ మిస్డ్ కాల్ ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. హైదరాబాద్ మొహదిపట్నంలో ఉండే సంధ్యకు ఓ రాంగ్ నంబర్ కాల్ తో పరిచయం అయ్యాడు శేఖర్. వీరి పరిచయం ప్రేమగా మారింది. నాలుగు సంవత్సరాలు ప్రేమ వ్యవహరం నడిపిన శేఖర్. ఆమే దగ్గరున్న ఎనమిది లక్షల రూపాయలు వాడుకున్నాడు. సంద్య పెళ్ళి ప్రస్థావన తేవడంతో పట్టించుకోవడం మానేశాడు. మోసపోయానని గ్రహించిన సంధ్య పంజాగుట్ట పోలీస్టేషన్ ను ఆశ్రయించింది. పోలీసులు ఆరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్ పై విడుదలైన శేఖర్ యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆసీఫ్ నగర్ లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలని సంధ్య కోరుతోంది.
కన్న తల్లే కసాయిగా మారింది. పేగు బంధాన్ని 20 వేలకు అమ్మేసింది. భర్తకు కూడా చెప్పకుండా.. డబ్బు తీసుకుని ఉడాయించేసింది. పోలీసులు రాజీకి ప్రయత్నించారు. మీడియా జోక్యంతో బిడ్డ కన్నతండ్రి పొత్తిళ్లలోకి చేరాడు.
నెల్లూరు జిల్లా కొవ్వూరులో నివసించే మునెయ్య, అంకమ్మ దంపతులకు ఐదుగురు పిల్లలు. ఈ కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరి ఇదే కారణమైందో.. ఇంకా ఏదైనా ఇబ్బంది ఎదురైందో గానీ.. అంకమ్మ తన చివరి సంతానం.. ఎనిమిది నెలల పసికందును అమ్మకానికి పెట్టింది. ఓ స్థితిమంతుల కుటుంబానికి 20 వేల రూపాయలకు బిడ్డను అమ్మేసి.. డబ్బు తీసుకుని పరారైంది. విషయం తెలుసుకున్న భర్త మునెయ్య పోలీసులను ఆశ్రయించాడు.
అయితే.. వారు బిడ్డ ఆచూకీ కనిపెట్టారు కానీ స్థితిమంతుల ప్రభావానికి లోనై దుప్పటి పంచాయతీకి ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న మీడియా రంగంలోకి దిగడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. మునెయ్య బిడ్డను తెచ్చి అతడికి అప్పగించేశారు. మొత్తానికి కన్నతల్లి తెంచుకున్న పేగు బంధాన్ని సజీవం చేసుకునేందుకు కన్నతండ్రి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది.
బ్రెజిల్ రియోడిజెనేరోలో జరిగిన డాగ్స్ కార్నివాల్ ఆకట్టుకుంది. తమకెంతో ఇష్టమైన శునకాలను ప్రదర్శన కోసం తీసుకువచ్చారు జంతు ప్రేమికులు. అందంగా ముస్తాబు చేసిన జీవాలు ర్యాలీలో పాల్గొన్నాయి. బ్రెజిల్ కార్నివాల్ లో భాగంగా ఈ ర్యాలీ జరిగింది.
శ్రీలంక స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మహేంద్రరాజపక్షే, ప్రధాని రత్నసిరి విక్రమనాయకేతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ దేశ త్రివిధ దళాల నుంచి అధ్యక్షుడు రాజపక్షే గౌరవవందనం స్వీకరించారు. లంక అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన స్వాతంత్ర దినోత్సవ సందేశంలో పిలుపునిచ్చారు.
ఆయనో యువరాజు అయితేనేం ప్రజల కోసం తన రాజరికాన్ని పక్కన పెట్టాడు. సామాన్యుడిలా చిందేసి మరీ నిధులను సేకరించాడు. ఆయనే బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ. హైతీ భూకంప బాధితుల సహాయార్ధం బ్రిటన్ యువరాజు డ్యాన్స్ చేశాడు. బార్బడోస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రిన్స్ హ్యారీ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మైమరిపించాడు. ఈ ప్రదర్శన ద్వారా హ్యారీ 25నిమిషాల్లోనే 1500పౌండ్లను సంపాదించాడు.
జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అక్కినేని వారసుడు నాగచైతన్య ఏ మాయ చేసావె.. అంటూ మరోసారి మన ముందుకు వస్తున్నాడు. గౌతమ్ డైరెక్షన్, రెహ్మాన్ మ్యూజిక్ల కాంబినేషన్లో లవ్ ఎంటర్టైనర్గా వస్తున్నది ఈ సినిమా.
బాలివుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే కుటుంబసభ్యులతో కల్సి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఉదయ దర్శన విరామ సమయంలో దీపిక ఏడుకొండలవాడిని దర్శించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పులులవేటను అరికట్టాలని యాక్షన్ హీరో జాకీచాన్ పిలుపిచ్చారు. ఆసియా, రష్యాలలో పులుల సంఖ్యగణనీయంగా తగ్గిపోతోందని జాకీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈప్రాంతంలో ప్రస్తుతం 3వేల 5వందల పులులు మాత్రమే ఉన్నాయని అన్నారు. పులుల సంరక్షణకు ప్రత్యేకంగా నిర్మించిన డాక్యుమెంటరీనీ జాకీ విడుదల చేశారు.