మావోలకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. రెండు జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు చనిపోయారు. ప్రకాశం జిల్లా నరజాముల తండా దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు చనిపోయారు. ఇక వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అటవీ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు సోలిపేట కొండల్ రెడ్డి మృతిచెందారు. అటు శాఖమూరి డెడ్బాడీని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ హాస్పటల్కు తరలించిన అధికారులు శనివారం పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. శాఖమూరి మృతితో ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపూర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కొడుకు చనిపోయాడని తెలుసుకున్న శాఖమూరి కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఇవి బూటకపు ఎన్కౌంటర్లని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇద్దరినీ మూడు రోజుల కిందటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఇప్పుడు కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారన్నారు. మరోవైపు ఈ రెండు ఎన్కౌంటర్లపై సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ పోలీస్ అధికారులను ఆదేశించింది. |