Lok Sabha Polls 2024: దేశంలో 14 నుంచి 6కు తగ్గిన జాతీయ పార్టీల సంఖ్య

National Parties Fall From 14 To 6
x

Lok Sabha Polls 2024: దేశంలో 14 నుంచి 6కు తగ్గిన జాతీయ పార్టీల సంఖ్య

Highlights

Lok Sabha Polls 2024: ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో రాజకీయ పార్టీలకు కొదవే లేదు.

Lok Sabha Polls 2024: ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. ప్రజలకు సేవ చేయాలనుకున్న వారు.. స్వేఛ్చగా పొలిటికల్ పార్టీలను స్థాపించుకోవచ్చు.. ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్లొచ్చు. ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో వేల సంఖ్యలో రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ఐతే భారత్‌లో రాను రాను జాతీయ పార్టీల సంఖ్య తగ్గిపోతోంది. ఏడు దశాబ్దాల కాలంలో జాతీయ పార్టీల సంఖ్య సగానికంటే తక్కువకు పడిపోయింది. ఇంతకు ఒక పొలిటికల్ పార్టీకి జాతీయ హోదా దక్కించుకోవాలంటే దానికి కొలమానాలేంటి..? ఏ అర్హతలను బట్టి జాతీయ పార్టీగా గుర్తింపు దక్కుతుంది. రాను రాను ఎందుకు జాతీయ పార్టీలు తమ హోదాను కోల్పోయి ప్రాంతీయ పార్టీలుగా మిగిలిపోతున్నాయి.

1951లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 14 జాతీయ పార్టీలు పోటీలో ఉంటే.. 2024కు వచ్చేసరికి వాటి సంఖ్య 6కు తగ్గింది. అదే సమయంలో జాతీయ, రాష్ట్ర పార్టీలు కలిపి మొదటి ఎన్నికల్లో కేవలం 53 మాత్రమే ఉండగా.. ఇప్పుడు మొత్తం పార్టీల సంఖ్య 2,500కు చేరుకున్నది. ఎలక్షన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా ముద్రించిన ‘లీప్​ ఆఫ్​ ఫెయిత్’ బుక్​ ప్రకారం..1953 ఎన్నికలకు ముందు మొత్తం 29 పార్టీలు జాతీయ హోదా కోసం డిమాండ్​ చేశాయి. అందులో 14 పార్టీలకే జాతీయ పార్టీ హోదా దక్కింది. కాలం మారుతున్న కొద్దీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాభల్యం పెరగడంతో కొన్ని జాతీయ పార్టీలు తమ ఆధారణను కోల్పోయాయి. ఇంకొన్ని కనుమరుగవుతూ వచ్చాయి.

మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలా ఏండ్ల వరకు కాంగ్రెస్​ ఆధిపత్యం కొనసాగింది. 2014 వరకు మొత్తం 14 ఎన్నికల్లో 11 సార్లు గెలిచి, జైత్రయాత్ర కొనసాగించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో గాలి బీజేపీవైపు మళ్లింది. 2014కు వచ్చేసరికి ఆరు జాతీయ పార్టీలు సహా 464 పార్టీలు బరిలో నిలిచాయి. తృణమూల్​ కాంగ్రెస్​ కు 2016లో జాతీయహోదా దక్కగా, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ జాతీయ హోదాలో పోటీ చేసింది. 2019 ఎన్నికల్లో ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్​, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్​ కాంగ్రెస్ సహా 674 పార్టీలు పోటీ చేశాయి. అయితే టీఎంసీ​, ఎన్సీపీ, సీపీఐ జాతీయహోదా కోల్పోయాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీని ఈసీ జాతీయ పార్టీగా గుర్తించింది. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉండటంతో పాటు గుజరాత్, గోవాల్లో భారీగా ఓట్లు సాధించడంతో ఆప్‌కు జాతీయ హోదా ఇస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ జాతీయ పార్టీలకు ఉన్న జాతీయ పార్టీ హోదాను ఈసీ రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో 56 రాష్ట్ర పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీగా నమోదు అయి, గుర్తింపు పొందని పార్టీలు వందల సంఖ్యలో ఉన్నాయి.

ఒక పార్టీకి జాతీయ హోదా దక్కితే దేశవ్యాప్తంగా ఆ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు ఒకే గుర్తు ఉంటుంది. అలాగే ఆ పార్టీకి దేశ రాజధానిలో కార్యాలయంలో కోసం స్థలాన్ని కేటాయిస్తారు. కాగా, ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, నేషనల్​ పీపుల్స్​ పార్టీ, సీపీఎం, ఆమ్​ ఆద్మీపార్టీ జాతీయ హోదాలో పోటీ చేస్తున్నాయి. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. మరి రాబోయే ఎన్నికల తర్వాత.. ఎన్ని పార్టీలు జాతీయ హోదాను నిలబెట్టుకుంటాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories