BJP: బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల.. వారణాసి నుంచి మళ్లీ ప్రధాని మోడీ పోటీ

BJP First Phase List of Candidates Released
x

BJP: బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల.. వారణాసి నుంచి మళ్లీ ప్రధాని మోడీ పోటీ 

Highlights

BJP: తొలి జాబితాలో 34మంది కేంద్రమంత్రులకు అవకాశం

BJP: సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా... తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ బరిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ స్థానంలో ధర్మపురి అరవింద్, కరీంనగర్ లో బండి సంజయ్ పోటీ చేయనున్నారు. అనేక ఊహాగానాల నడుమ మల్కాజ్ గిరి స్థానంలో ఈటల రాజేందర్ కు టికెట్ ఇచ్చింది హైకమాండ్. హైదరాబాద్ స్థానంలో మాధవీలత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, భువనగిరి స్థానంలో బూర నర్సయ్యగౌడ్ కు టికెట్ కన్ఫామ్ చేసింది. ఇటీవలే పార్టీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు టికెట్ దక్కగా.. నాగర్ కర్నూల్ నియోజకవర్గ బరిలో ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ పేరును ప్రకటించారు. తీవ్ర పోటీ ఉన్న మహబూబ్ నగర్ స్థానంతో పాటు.. ఆదిలాబాద్ స్థానాన్ని పెండింగ్ లోనే ఉంచింది అధిష్టానం.

రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు దక్కాయి. అసోంలోని 14 లోక్ సభస్థానాలకు గాను 11 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అసోం సీఎం శరబానంద సోనోవాల్ కూడా దిబ్రూఘర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

బెంగాల్ నుంచి ఇరవై, మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు, గుజరాత్ నుంచి పదిహేను, రాజస్థాన్ నుంచి పదిహేను, కేరళ నుంచి పన్నెండు, తెలంగాణ నుంచి తొమ్మిది, అసోం, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి పదకొండు సీట్ల చొప్పున, ఢిల్లీ నుంచి ఐదు స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు. వారణాసి నుంచి ప్రధాని మోడీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, త్రిసూర్ నుంచి సురేశ్ గోపి, గాంధీ నగర్ నుంచి అమిత్ షా, విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories