ఒంటరిపోరులో కమలం వరాలు...కనివిని ఎరుగని రీతిలో మ్యానిఫెస్టో

x
Highlights

ఇంటికి అద్దె. నల్లా పన్ను ఓన్లీ ఆరు రూపాయలు. ఉద్యోగాలు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు. చేతి వృత్తులు, కులవృత్తులు, 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు...

ఇంటికి అద్దె. నల్లా పన్ను ఓన్లీ ఆరు రూపాయలు. ఉద్యోగాలు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు. చేతి వృత్తులు, కులవృత్తులు, 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు పెన్షన్. ఏంటీ ఇదేమైనా యూపీ లేదంటే తమిళనాడు ఎన్నికల మ్యానిఫెస్టో అనుకుంటున్నారా డీఎంకే, అన్నాడీఎంకేల వరాల వలలని భావిస్తున్నారా తెలంగాణలోనే. అదీ కూడా ఏ పార్టో తెలుసా భారతీయ జనతా పార్టీ. మరి రాలతాయా కాషాయ పార్టీ పథకాలకు ఓట్లు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమైన భారతీయ జనతా పార్టీ, సకల అస్త్రాలనూ ప్రయోగిస్తోంది. స్వతంత్ర భారతావనిలో, ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ ప్రకటించని ఆకర్షణీయ పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర నాయకత్వం ఆర్బాటంగా ప్రకటించింది.

తాము అధికారంలోకి వస్తే పల్లె నుంచి మహానగరం వరకు కిరాయి ఇంట్లో ఉంటున్న వారందరికీ రూ.5వేల వరకూ అద్దె ఇస్తామని ప్రకటించింది కాషాయ పార్టీ. సొంతిల్లు కట్టుకునే వరకు కిరాయి బాధ్యత తమదేనని తెలిపింది. అంతేకాదు, ఎవరూ ఊహించని పథకాలనూ వడ్డివారుస్తామంటోంది బీజేపీ. ఇంటింటికి అందించే మంచి నీటికి నెలకు పన్ను 6 రూపాయలే వసూలు చేస్తామంటోంది. ఇంకా ఏయే హామీలను ఇచ్చేందుకు సిద్దమైందంటే, 59 ఎస్సీ ఉప కులాలకు సర్టిఫికెట్లు, డప్పు కొట్టేవాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లకు రూ. 3వేల పింఛన్‌. మధ్యతరహా పరిశ్రమలకు ఉచితంగా విద్యుత్తు. చేతి వృత్తులు, కులవృత్తులు, 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు 3వేల వరకు పింఛన్‌. ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు. పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు. ఏటా రిక్రూట్‌మెంట్‌- లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు- డిగ్రీ పైస్థాయి విద్యార్థులకు ఉచిత ల్యాప్‌ట్యాప్‌లు. యూపీ, తమిళనాడు తరహాలో కనివిని ఎరుగని హామీలు కురిపించింది బీజేపీ.

బీజేపీ మ్యానిఫెస్టో ముసాయిదాపై, హైదరాబాద్‌ పార్టీ ఆఫీసులో సమావేశమైన రాష్ట్ర నాయకత్వం, ఏయే పథకాలను ప్రణాళికలో చేర్చాలో చర్చించింది. రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్వీఎస్ ఎస్‌ ప్రభాకర్‌‌తో సహ కీలక నాయకులు డిస్కషన్‌లో పాల్గొన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం తమ మ్యానిఫెస్టో దోహదపడుతుందని చెప్పారు. రైతులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలను భాగస్వాములుగా చేసి వినూత్న పద్ధతిలో మ్యానిఫెస్టో రూపొందిస్తున్నామని, ఈనెల 15కల్లా తుదిరూపం ఇస్తామన్నారు. తమది ప్రజా మ్యానిఫెస్టోగా అభివర్ణించారు నేతలు. ఇళ్లకు, నల్లాలకు అనేక వరాలు ప్రకటించిన బీజేపీ, ప్రధానంగా పట్టణాలు, నగరాలపైనే దృష్టిపెట్టినట్టు అర్థమవుతోంది. మధ్య తరగతి ఓట్లను కొల్లగొట్టేందుకు, తమిళనాడు తరహా వరాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌పై ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందిస్తామని కాషాయ నేతలు తెలిపారు.

మొత్తానికి పొత్తుల్లేక కంగారుపడుతున్న కమలం, ప్రజాకర్షక మ్యానిఫెస్టోతోనే గట్టెక్కుతామని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు పోటీగా అనేక వరాలను వండివారుస్తోంది. కానీ ప్రాంతీయ పార్టీలు అలవికాని హామీలు ఇస్తున్నాయని గతంలోనే, వెంకయ్య నాయుడు, అరుణ్‌ జైట్లీ వంటి సీనియర్‌ నాయకులు విమర్శించారు. ఇలాంటి ప్రలోభాల ఎన్నికల ప్రణాళికలకు తాము వ్యతిరేకమని కూడా అన్నారు. కానీ చివరికి బీజేపీ కూడా తమిళనాడు, యూపీ ప్రాంతీయ పార్టీల తరహాలోనే, అలవికాని హామీలను ఇచ్చి, అధికారంలోకి రావాలనుకుంటోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. బీజేపీ మ్యానిఫెస్టోపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కూడా స్పందించారు. ఇవేం హామీలని విమర్శించారు. మొత్తానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి సహా బీజేపీ, గెలుపే ధ్యేయంగా అనేక అలవికాని హామీలను జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాయి. ఇవన్నీ ఆచరణ సాధ్యమేనా, కేవలం ఎన్నికల్లో ఆకర్షించడానికేనా అని సామాజిక, రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories