మాస్టర్ @ 45

మాస్టర్ @ 45
x
Highlights

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ 45వ పడిలోకి ప్రవేశించాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సచిన్ పుట్టినరోజు వేడుకలను...

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ 45వ పడిలోకి ప్రవేశించాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సచిన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు. క్రికెటర్ గా, రాజ్యసభ సభ్యుడిగా రిటైరైన
సచిన్ ప్రస్తుతం క్రికెటేతర క్రీడల ప్రమోటర్ గా వ్యవహరిస్తూనే పలు రకాల సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. తన పూర్తిసమయాన్ని కుటుంబానికే కేటాయిస్తూ గడుపుతున్నాడు.

సచిన్ రమేశ్ టెండుల్కర్ మొన్నటి, నిన్నటి, నేటితరాల క్రికెట్ కమ్ క్రీడాభిమానులకు అత్యంత సుపరిచితమైన పేరు. పరిచయం ఏమాత్రం అవసరం లేని పేరు కూడా. 1973 ఏప్రిల్ 24న ముంబైలోని బాంద్రాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సచిన్ 15 ఏళ్ల చిరుప్రాయంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రభంజనం సృష్టించాడు. 16 ఏళ్ల వయసులోనే భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు.

ఆ తర్వాత నుంచి 22 సంవత్సరాల పాటు ఏకబిగిన క్రికెట్ కెరియర్ కొనసాగించి రికార్డుల మోత మోగించాడు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అన్నతేడాలేకుండా భారత, ప్రపంచ క్రికెట్ కే మూలవిరాట్టుగా నిలిచాడు. తన ఆటతీరు, ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే తత్వం, అంతకుమించి అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది. అభిమానులను సంపాదించుకొన్నాడు. జనసంమోహక క్రికెటర్ గా నీరాజనాలు అందుకొన్నాడు.

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో 200 టెస్టులు, 51 సెంచరీలు, టన్నుల కొద్దీ పరుగులు, వన్డే క్రికెట్లో 443 వన్డేలు , 49 శతకాలు, 15వేలకు పైగా పరుగులు సాధించి ఈఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. మానవసాధ్యంకాని ఎన్నో రికార్డులు నమోదు చేసి ప్రపంచ క్రికెట్ సూపర్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. రెండు దశాబ్దాల నాన్ స్టాప్ క్రికెట్ కెరియర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ రాజ్యసభ సభ్యుడిగా, క్రికెటేతర క్రీడల ప్రమోటర్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.

క్రికెటర్ గా ఉన్న సమయంలోనే తన కుటుంబసభ్యుల సహకారంతో అప్నాలయ్ సంస్థ ద్వారా ముంబై మహానగరంలోని మురికివాడల పిల్లల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సచిన్ రాజ్యసభ్య సభ్యుడిగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాడు.

అంతేకాదు రాజ్యసభ సభ్యుడిగా ఐదేళ్ల కాలానికి తాను అందుకొన్న 90 లక్షల రూపాయల జీతభత్యాలను ప్రధానమంత్రి సహాయనిధికి అందచేసి తన పెద్దమనసు చాటుకొన్నాడు. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మెంటార్ గా, ఇండియన్ సాకర్ లీగ్ లో కేరళ బ్లాస్టర్స్ కో-ఓనర్ గా, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై జట్టు సహయజమానిగా ఉన్న సచిన్ క్రికేటతర క్రీడాకారులకు తనవంతుగా సేవలు అందిస్తున్నాడు.

కుటుంబం కోసం పూర్తిసమయం కేటాయిస్తున్న సచిన్ నేటితరంలోనూ ఎందరో యువక్రికెటర్లకు స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తున్నాడు. జీవించి ఉండగానే భారత రత్న పురస్కారం అందుకొన్న ఒకే ఒక్కడు సచిన్ 45వ పుట్టిన రోజు వేడుకలను ముంబైలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని అభిమానులు సైతం జరుపుకొంటున్నారు.

ఏదిఏమైనా సచిన్ లాంటి అసాధారణ క్రికెటర్ భారత్ లోనే జన్మించినందుకు భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచినందుకు శతకోటి భారత ప్రజలు అనుక్షణం గర్విస్తూనే ఉంటారు. అభినవ బ్రాడ్మన్, భారత రత్న సచిన్ రమేశ్ టెండుల్కర్ కు HMTV సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories