చీమలదండులా కదిలిన ఎర్రదండు

చీమలదండులా కదిలిన ఎర్రదండు
x
Highlights

చీమల దండు అని వినడమేగానీ ఎవరూ చూసి ఉండరు. మహారాష్ట్రలో రైతులు అచ్చం చీమల దండులా కదిలారు. సమస్యల పరిష్కారం కోసం పదం పదం కలిపారు. పోరు బాట పట్టారు....

చీమల దండు అని వినడమేగానీ ఎవరూ చూసి ఉండరు. మహారాష్ట్రలో రైతులు అచ్చం చీమల దండులా కదిలారు. సమస్యల పరిష్కారం కోసం పదం పదం కలిపారు. పోరు బాట పట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్ రైతులు భారీ ఆందోళన చేపట్టారు. నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో దాదాపు 30 వేలకు పైగా అన్నదాతలు పాల్గొంటున్నారు.

180 కిలోమీటర్లు ఏడు రోజులు. అసెంబ్లీ ముట్టడి. ఇది మహారాష్ట్రలో ఎర్రదండు లక్ష్యం. సీపీఎం అనుబంధ సంస్థ అఖిల భారతీయ కిసాన్ సభ ఈ భారీ ర్యాలీ చేపట్టింది. ఈనెల 6న నాసిక్‌ నుంచి మొదలైన రైతుల ర్యాలీ 12వ తేదీ నాటికి ముంబై చేరుకుంటుంది. ఎర్రదండు నాసిక్ నుంచి ముంబైకి నడుచుకుంటూ వెళ్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి అక్కడికి చేరుకొని ఆందోళన చేయాలని భావిస్తోంది. మహారాష్ట్ర శాసన సభను ముట్టడించబోతున్నారు.

పగలంతా ముంబయి-ఆగ్రా జాతీయ రహదారి వెంట నడుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాత్రుళ్ళు రోడ్ల పక్కనే సేదతీరుతూ మహారాష్ట్ర రైతన్నలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా రైతులను చైతన్య పరుస్తోంది అఖిల భారతీయ కిసాన్ సభ.

పంట రుణమాఫీ, విద్యుత్ బిల్లుల మాఫీ , పాల ధర పెంపు, పంట నష్టపోయిన రైతులకు పరిహారం , స్వామినాథన్ కమిషన్ సిఫార్పుల అమలు ఇవీ అఖిల భారతీయ కిసాన్ సభ డిమాండ్లు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 1753మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రైతు సంఘం నేతలు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో ముంబైలో అసెంబ్లీని ముట్టడించి అన్నదాతలు సత్తా చూపుతామంటున్నారు. రైతులకు రుణమాఫీ చేసి న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆల్ ఇండియ కిసాన్ సభ హెచ్చరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories