పల్స్‌ పోలియో నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం...లక్షలాది మంది చిన్నారులకు పోలియో ముప్పు..?

x
Highlights

పిల్లలకు పోలియో రాకుండా ప్రతి మూడు నెలలకు ఓసారి రెండు చుక్కల వ్యాక్సిన్ వేయిస్తాం. రెండంటే రెండు పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యానికి భద్రతనిస్తాయి....

పిల్లలకు పోలియో రాకుండా ప్రతి మూడు నెలలకు ఓసారి రెండు చుక్కల వ్యాక్సిన్ వేయిస్తాం. రెండంటే రెండు పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యానికి భద్రతనిస్తాయి. కానీ అవే పోలియో చుక్కల వల్ల పోలియో వచ్చే ప్రమాదం వస్తే..? పిల్లల పరుగులు ఆగకుండా వేసే పోలియో చుక్కలు కాస్తా ప్రమాదకరంగా మారితే..? ఇప్పడు ఇవే భయాలు లక్షలాది మందిని వెంటాడుతున్నాయి. రెండంటే రెండు పోలియో చుక్కలు అనేక మంది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. అవును 2016 తర్వాత పోలియో చుక్కలు వేయించిన తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త. ఆ తల్లిదండ్రులకే కాదు మన దేశాన్ని పోలియో ఫ్రీగా మార్చామని జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వ పెద్దలకు కూడా ఇప్పుడు చెప్పబోయే వార్త చేదు గుళికే.

పోలియా రాకుండా వేయించిన వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు పోలియో వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ వాడకూడనిది కాబట్టి. అవును 2016 తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్‌లలో వాడిన పల్స్ పోలియో వ్యాక్సిన్ కలుషితమైందని తేలింది. గత నెలలో ఆ పోలియో వ్యాక్సిన్ శాంపిల్స్‌ ను పరీక్షించినప్పుడు అది వాడకూడని మందని రిపోర్ట్ వచ్చింది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. కలుషిత మందు ఎక్కడ తయారైందో ఆరా తీయగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఉన్న బయో మెడ్ ఫార్మా కంపెనీలో తయారైనట్లు తెలిసింది. దీంతో పోలీసులు బయో మెడ్ ఫార్మా ఎండీని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నిజానికి పోలియోలో టైప్ 1, 2, 3 అనే మూడు రకాల వ్యాక్సిన్లు ఉంటాయి. ప్రసుతం టైప్ 1, టైప్ 3 వాక్సిన్లను మాత్రమే మన దేశంలో వాడాలి. ఇండియాను 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించాక టైప్ 2 వ్యాక్సిన్ ను మొత్తంగా ఉపసంహరించుకున్నారు. టైప్ 2 వ్యాక్సిన్ నిల్వల్ని ధ్వంసం చేశారు. అయితే ఘజియాబాద్‌లోని బయో మెడ్ ఫార్మా కంపెనీ తయారు చేయకూడని , వాడకూడని టైప్ 2 వ్యాక్సిన్లనే నే తయారు చేసోంది. దేశంలో టైప్ 1, టైప్ 3 పోలియో వాక్సిన్లను మాత్రమే తయారు చేయాల్సి ఉండగా అసలు వాడకూడని వ్యాక్సిన్‌ను తయారు చేసి సరఫరా చేస్తోంది. ఫార్మా కంపెనీ వాళ్ళు గుడ్డిగా తయారు చేసిన కల్తీ మందుని ప్రభుత్వ అధికారులు పిల్లలకు ఎలా వేశారనేది అర్థంకాని ప్రశ్న.

యూపీకి చెందిన ఫార్మా కంపెనీ టైప్ 2 పోలియో వ్యాక్సిన్ 2016 నుంచి తయారు చేస్తోంది. అప్పటి నుంచి ఆ పోలియో మందు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లో సరఫరా చేస్తూనే ఉన్నారు. వాడకూడని పోలియో వ్యాక్సిన్‌ను గత రెండేళ్ళుగా ఆయా రాష్ట్రాల్లో వాడుతూనే ఉన్నారు. 2016 తరువాత కలుషిత పోలియో చుక్కలు వేయించుకున్న వారిపై ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందర్నీ భయపెడుతున్న అంశం. పిల్లలపై కల్తీ వ్యాక్సిన్ దుష్పరిణామాన్ని ఎలా ఉందో తెలుసుకోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ , ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగాయి. కల్తీ పోలియో వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కల్తీ పోలియో వ్యాక్సిన్ ప్రభావం అది వేసుకున్న పిల్లలపై ఎలా ఉంటుందో ఈ కమిటీ అంచనా వేస్తోంది.

వాడకూడని పోలియో వ్యాక్సిన్‌‌ను తయారు చేయడం ఓ తప్పయితే దానిని పరీక్షించుకుండానే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం మరో పెద్ద తప్పు. అంతా కలసి పిల్లల ప్రాణాలతో చెలగాడమాటడం అతి పెద్ద నిర్లక్ష్యం. ఈ తప్పుకు ఎవరు బాధ్యత వహిస్తారు..? ఒకవేళ కల్తీ పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారులకు జరగరానికి ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత..? దేశంలో మళ్ళీ పోలియో విజృంభిస్తే..పరిస్థితి ఏంటి..? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు. ప్రస్తుతానికైతే..కల్తీ పోలియో మందు తయారు చేసిన ఉత్తర ప్రదేశ్‌‌కు చెందిన బయో మెడ్ ఫార్మా కంపెనీ డైరెక్టర్ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురు డైరెక్టర్ల కోసం వేట ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories