ఎన్నాళ్లీ ఎదురు చూపులు

ఎన్నాళ్లీ ఎదురు చూపులు
x
Highlights

50 రోజులు. తన్విత తల్లికి దూరమై ఇవాల్టికి సరిగ్గా 50 రోజులు. కన్న ప్రేమ..పెంచిన ప్రేమ మధ్య పోరాటంలో నలిగిపోతున్న చిన్నారి... అమ్మ ఒడికి దూరమై అప్పుడే...

50 రోజులు. తన్విత తల్లికి దూరమై ఇవాల్టికి సరిగ్గా 50 రోజులు. కన్న ప్రేమ..పెంచిన ప్రేమ మధ్య పోరాటంలో నలిగిపోతున్న చిన్నారి... అమ్మ ఒడికి దూరమై అప్పుడే 50 రోజులైంది. అమ్మ ప్రేమకు దూరమైన ఇల్లందు చిన్నారి తన్విత ఇంకా ఖమ్మం బాలసదనంలోనే గడుపుతోంది. ఎవరూ లేని అనాథలా..ఏకాకిలా.. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న...తన్వితకు విముక్తి ఎప్పుడు..? తల్లి ఒడికి చేరేదెన్నడు.

పెద్దవాళ్లు తప్పు చేస్తే... ఊహ కూడా తెలియని పాపకు ఎందుకింత కష్టం..? కాసేపు అమ్మ కనిపించకపోతే...గుక్కపట్టి ఏడ్చే వయసు. అమ్మ తినిపిస్తే కానీ తినబోనని మారాం చేసేంత చిన్నతనం. కానీ చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది. ఇద్దరు తల్లులకు న్యాయం సంగతి సరే. చిన్నారికి మాత్రం ప్రస్తుతం అన్యాయం జరుగుతోంది. ఈ విషయాన్ని ఎవరూ ఆలోచించడంలేదు. 50 రోజులుగా తన్విత అమ్మ కోసం పలవరిస్తోంది. అమ్మ కావాలంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతోంది. కానీ అమ్మను తెచ్చిచ్చేవారే లేరు. అమ్మ ఏదంటే సరైన సమాధానం చెప్పే వారు లేరు. అమ్మలేకుండా ఎన్నడూ గడపని తన్విత.. ప్రస్తుతం 50 రోజులుగా ఆమెకు దూరంగా ఉంటోంది. ఖమ్మం బాలసదనంలోనే అమ్మ కోసం ఎదురు చూపులు చూస్తోంది.

50 రోజులుగా ఇంటికి దూరమైన తన్విత మళ్లీ అక్కడికి చేరేదెప్పుడు.? అందరిలాగా మళ్లీ తల్లి చేతి గోరు ముద్దలు తినేదెప్పుడు..? అందరు పిల్లల్లా స్వేచ్చగా తిరిగేది ఎప్పుడు? బుడిబుడి నడకలతో బొమ్మలతో ఆడుకునేదెప్పుడు. తల్లి ఒడిలో వెచ్చగా నిద్రపోయే రోజు ఎప్పుడు...? కొద్ది రోజుల్లో కేసు తేల్చేస్తామన్న అధికారులు..ఇప్పుడు నోరు మెదపడం లేదు. తల్లుల గొడవ సంగతి వదిలేద్దాం. కనీసం చిన్నారి ఆరోగ్యం గురించైనా ఆలోచించాలి కదా..? తల్లి లేకుండా ఓ పాప ఇన్ని రోజులు ఎలా ఉండగలదు..? అధికారులు, న్యాయస్థానాలు కనీసం పాప ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించడం లేదు. అధికారులు కనీస మానవత్వంతో ఎందుకు చూడడంలేదు.

తన్విత కథనం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి hmtv చిన్నారి వేదనను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియచేస్తోంది. తన్విత కన్నీటి గాథను తెలియ చేస్తూ..ఆమెకు మద్దతు కూడగడుతోంది. తల్లుల ఆవేదనను ప్రేక్షకులకు చూపిస్తోంది. ఇప్పుడు అందరూ కోరుకునేది ఒకటే తన్వితను ఇద్దరు తల్లుల్లో ఎవరో ఒకరి త్వరగా అప్పగించమని. చిన్నారి తన్వితపై hmtvలో వస్తున్న వరుస కథనాలకు విశేష స్పందన లభిస్తోంది. వాట్సప్ ద్వారా ఎందరో తల్లులు తమ అభిప్రాయాలను పంపుతున్నారు. చిన్నారి విషయంలో అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తన్విత వివాదం ఇప్పటికే ఖమ్మం కోర్టులో ఉంటే తాజాగా హైకోర్టుకూ చేరింది. తన్విత వివాదంపై ఆమె పెంపుడు తల్లి స్వరూప హైకోర్టులో హెబియస్ కార్పస్ పటిషన్ దాఖలు చేశారు. తన్వితను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఉంచడం చట్ట విరుద్ధమని ఫిర్యాదు చేశారు. తన్వితను వెంటనే న్యాయస్థానంలో హాజరుపరచాలని కోరారు. స్వరూప వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, తన్విత కన్నతల్లి ఉమకి, పోలీసులకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

తన్విత వివాదంపై ఖమ్మం ICDS అధికారులు ఇప్పటికే స్థానిక కోర్టుకు నివేదిక సమర్పించారు. కానీ నిర్ణయం ప్రకటించడంతో మాత్రం ఆలస్యం అవుతోంది. అసాధారణమైన కేసును కూడా ఇతర కేసుల్లానే భావిస్తూ తీర్పు ఇవ్వకుండా సాగదీస్తున్నారు. ఈ ఆలస్యానికి కారణం ఏమిటి..? ఆటపాటలతో ఆడుకునే చిన్నారిని భయానక స్థితిలోకి ఎందుకు తీసుకెళుతున్నారు..? తుది నిర్ణయం కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి. ఈలోగా చిన్నారి తన్వితకు జరగరానిది ఏదైనా జరిగితే...? తల్లి మీద బెంగతో అనారోగ్యం పాలైతే..? అప్పుడు ఎవరిది బాధ్యత..? ఎవరు సమాధానం చెబుతారు..?

తన్విత పెంపుడు తల్లి పిటిషన్ను విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదులకు రెండు వారాల గడువు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన సమయం ఇప్పటికి వారమే పూర్తయ్యింది. మరో వారం రోజులు మిగిలే ఉంది. ఆ తర్వాత ప్రక్రియ ఎలాగూ ఇంకొద్ది వారాలు పడుతుంది. అంటే తన్విత కేసు తేలడానికి మరింత ఆలస్యమౌతుందని అర్థమవుతోంది. ఈ విషయమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎందరో తల్లుల మాట ఇప్పుడు ఒకటే. విచారణ త్వరగా ముగించి పాపను అమ్మ ఒడికి చేర్చాలని. పాప ఆరోగ్యంతో చెలగాటమడొద్దని. ఇప్పటికైనా అధికారులు న్యాయస్థానాలు మానవతా ధృక్పధంతో ఆలోచించాలి. అమ్మ ప్రేమకు దూరమైన చిన్నారి కేసును త్వరగా తేల్చాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories