టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ
x
Highlights

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ సభ్యత్వాల రద్దుపై సింగిల్‌...

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ సభ్యత్వాల రద్దుపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌‌ను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దును కొట్టివేసిన హైకోర్టు.. తాజాగా అప్పీల్‌ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. టీఆర్ఎస్ పిటిషన్‌ విచారించ దగినదా.. లేదా.. అనేదానిపై వేసవి సెలవుల ముందు వాదనలు విన్న ధర్మాసనం.. ఇవాళ తీర్పునిచ్చింది.

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను.. ప్రైవేటు పిటిషన్ గానే భావిస్తున్నామని హైకోర్టు అభ్రిపాయపడింది. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయాలంటే.. అసెంబ్లీ సెక్రటరీ గానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున గానీ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌‌ను ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది.

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగ సమయంలో గందరగోళం సృష్టించారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించి రెండు జీవోలను కూడా విడుదల చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లపై విధించిన నిషేధం చెల్లదని.. వారి సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. మొత్తం 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించిన సమయంలో తాము కూడా అసెంబ్లీలోనే ఉన్నామని.. అందుకే, తమ వాంగూల్మాలను పరిగణనలోకి తీసుకోవాలని టీఆర్ఎస్ సభ్యులు కోర్టుకి తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నిషేధాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హంపై.. ఏఫ్రిల్ లో హైకోర్టు వాదనలు వింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ఉన్నందున.. వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని కాంగ్రెస్‌ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories