ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీసీసీ లిస్టు రానే వచ్చింది. ఏఐసీసీ లిస్టు పార్టీలో వివాదాలకు దారి తీయడంతో పీసీసీ జాబితాని టాప్ సీక్రెట్గా...
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీసీసీ లిస్టు రానే వచ్చింది. ఏఐసీసీ లిస్టు పార్టీలో వివాదాలకు దారి తీయడంతో పీసీసీ జాబితాని టాప్ సీక్రెట్గా ఉంచుతోంది. ఇంత గోప్యంగా ఉంచినప్పటికి ఇప్పటికే సర్క్యులేట్ అవుతున్న ఓ లిస్టు కారణంగా పార్టీలో వివాదం రాజుకుంటోంది.
ఏఐసీసీ ఎన్నికలు, ఫ్లీనరీ సమావేశానికి ముందు పీసీసీ అధ్యక్ష ఎంపిక కసరత్తు జనవరిలో జరిగింది. అయితే పీసీసీ అధ్యక్షుని ఎన్నుకునేందుకు పీసీసీ సభ్యుల ఎంపిక కూడ జరిగింది. ప్రతి నియోజికవర్గం నుంచి ఇద్దరు పీసీసీ సభ్యులను ఎంపిక చేశారు. వీళ్లే పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కానీ పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ లేకపోవడం ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికే అప్పగించడంతో రాష్ట్రంలో పీసీసీ సభ్యులు ఎవరనే పరిస్థితి తెలియని పరిస్థితి నెలకొంది. ఇది బయటకొస్తే పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతాయని పీసీసీ అతి గోప్యంగా సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఈ లిస్టును బయటపెట్టొద్దని గాంధీభవన్ ఆదేశించినప్పటికీ మొత్తం జాబితా బయటపడి హస్తం పార్టీలో చిచ్చు రాజుకుంటోంది.
ఇకపై ఒకరికి రెండు పదవులు ఉండవని అధిష్టానం చెప్పడంతో పార్టీ సీనియర్లు తమ కుటుంబాల్లోని ఇద్దరు పీసీసీ సభ్యులుగా ఉండేలా జాగ్రత్తపడ్డారు. పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి తన కుటుంబానికి మూడు పదవులు కేటాయించుకోవడం చాలా మందికి మింగుడుపడడంలేదు. ఉత్తమ భార్య పద్మావతి, తమ్ముడు కౌశిక్ రెడ్డి పీసీసీ జాబితాలో ఉండడంపై ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతోంది. పొన్నాల, ఆయన కోడలు వైశాలి పీసీసీ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి తన కుమారుడు రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ నుంచి పీసీసీ లిస్టులో స్థానం ఇప్పించారు. రంగారెడ్డిజిల్లాలో సబితా ఇంద్రారెడ్డి కుటుంబంలో ఇద్దరికి స్థానం కల్పించారు.
నియోజక వర్గానికి సంబంధం లేకపోయినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. తన వర్గం నేతలు, సన్నిహితులకు లిస్టులో స్థానం కల్పించడం అసంతృప్తికి కారణమైతున్నాయి. నల్గొండ నుంచి కోమటి రెడ్డి బ్రదర్స్ కుటుంబం పేర్లు పీసీసీ జాబితాలో లేకపోవడం ఉత్తం వర్గంగా పేరున్న డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్, ఆయన భార్య సువర్ణకు పీసీసీలో స్థానం కల్పించడంపై నల్గొండజిల్లా నేతలు మండిపడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మాజీమంత్రి డీకే అరుణ కుటుంబానికి హ్యాండిచ్చారు. ఇటీవలే పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఏఐసీసీలో స్థానం కల్పించారు కాని పీసీసీ లో స్థానం దక్కపోవడంపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి , దామోదర్ రాజనర్సింహ్మా తమ భార్యలకు టిక్కెట్టు ఆశిస్తున్నారు. వారి పేర్లు లిస్టులో లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రాకుండా ఉత్తమ్ అడ్డుకుంటున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక వరంగల్ జిల్లాలో గండ్ర వెంటకరమణారెడ్డి తన భార్యకు టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లిస్టులో స్థానం కల్పించకపోవడంతో గండ్ర పీసీసీపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలు రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
పీసీసీ మెంబర్లుగా ఉన్న వారంతా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు రేసులో ఉండే నేతలు కావడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రత్యర్ధులుగా భావిస్తున్న నేతలను ఇప్పుడే కట్టడి చేసి ఎన్నికలనాటికి పార్టీపై పట్టుబిగించాలనేది ఆయన ప్లాన్ అంటున్నారు. స్థానం దక్కని వారికి వేరే పదవులు ఇస్తామని చెబుతున్నా సీనియర్లు నమ్మడం లేదు. ఈ దుమారం ఎక్కడికి దారి తీస్తుందనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire