ఆరుబయట పడుకుని ఆకాశంలోకి చూస్తున్న వేళ...

Highlights

రాత్రిపూట ఆరుబయట పడుకుని ఆకాశంలోకి చూస్తున్న వేళ, ఎక్కడి నుంచో ఓ నక్షత్రం రాలిపోయినట్టు కనిపిస్తుంది. దాన్ని చూసిన తరువాత కళ్లు మూసుకుని ఏదైనా కోరిక...

రాత్రిపూట ఆరుబయట పడుకుని ఆకాశంలోకి చూస్తున్న వేళ, ఎక్కడి నుంచో ఓ నక్షత్రం రాలిపోయినట్టు కనిపిస్తుంది. దాన్ని చూసిన తరువాత కళ్లు మూసుకుని ఏదైనా కోరిక కోరుకుంటే తీరుతుందని కూడా నమ్ముతుంటాం. అది నక్షత్రం కాదని, అంతరిక్షంలో పరిభ్రమించే అసంఖ్యాక ఉల్కల్లో ఒకటి భూ వాతావరణంలోకి వచ్చి మండి రాలిపోయిందన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఒక ఉల్క రాలితేనే దాన్ని అద్భుతంగా వీక్షిస్తాం. అటువంటిది కొన్ని వందలు, వేలు ఒకేసారి రాలితే... ఎంత అద్భుతంగా ఉంటుందా నక్షత్ర వాన. మానవ చరిత్రలో అతిపెద్ద ఉల్కాపాతం ఆగస్టు 12, 13 తేదీల్లో కనిపించనుంది.

వాస్తవంగా ఉల్కాపాతం ప్రతియేటా జూలై రెండో వారం నుంచి మొదలై దాదాపు నాలుగు వారాల పాటు ఉంటుంది. ఈ సంవత్సరం ఉల్కాపాతం మునుపటికన్నా ఎక్కువగా ఉంటుందని నాసా ఉల్కల అధ్యయన విభాగం నిపుణుడు బిల్ కూకీ వ్యాఖ్యానించారు. ఆగస్టు 12న అర్థరాత్రి ఒంటి గంటకు (ఈడీటీ - ఈస్ట్రన్ డేలైట్ టైమ్) గరిష్ట ఉల్కా పాతాన్ని చూడవచ్చని ఆయన అన్నారు. గంటకు 150 నుంచి 200 వరకూ ఉల్కలు భూమిని తాకనున్నాయని తెలిపారు. రెండు రోజులూ అర్థరాత్రి ఉల్కలు రాలడాన్ని చూడవచ్చని తెలిపారు.

అయితే, ఆ సమయం పౌర్ణమికి దగ్గరగా ఉండటంతో, చంద్రుడు పూర్తి స్థాయి ప్రకాశంతో వెండి వెన్నెలను కురిపిస్తూ ఉండటంతో ఉల్కలు రాలుతున్నా అవి స్పష్టంగా కనిపించక అసంతృప్తి కలుగుతుందని అన్నారు. కాగా, ఈ ఉల్కాపాతం ఉత్తర హెమీస్పీయర్ ప్రాంతం నుంచి స్పష్టంగా కనిపిస్తుందని, అక్కడి నుంచి మధ్య దక్షిణ ప్రాంతాలవైపు వెళ్లేకొద్దీ ఉల్కాపాతాన్ని చూడవచ్చని ఆయన తెలిపారు. ప్రపంచంలోని మిగతా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఉల్కాపాతం స్వల్పంగానైనా కనిపిస్తుందని అన్నారు. కూర్చుని ఓపికగా చూస్తే, కనువిందైన ఉల్కాపాతాన్ని దర్శించవచ్చని తెలిపారు.

రాత్రి పూట కూడా పగలు లాగా కనిపిస్తే భూమికి ఏదో ఉత్పాతం ఊడిపడనుందని భయపడతాం. కాని అది ఉత్పాతం కాదు.. ఉల్కాపాతం ప్రభావమట. బహశా మానవ చరిత్రలోనే అత్యంత భారీ ఉల్కా పాతం ఆగస్టు 12వ తేదీ రాత్రి కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి కూడా పగలు వలె కనిపిస్తుందని పేర్కొన్నారు. దాదాపుగా గంటకు 100 వరకు ఉల్కలు నేలరాలతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దృశ్యాలను చూడగలమని అంటున్నారు. 109పీస్విఫ్ట్‌–టట్టెల్‌ అనే తోకచుక్క నుంచి ఈ ఉల్కలు రాలుతాయని చెప్పారు.

ప్రతి ఏడాది జూలై మధ్య నుంచి ఆగస్టు చివరి వరకు ఉల్కలు రాలుతాయనీ, ఆగస్టు మధ్యలో ఓ రెండ్రోజులు ఎక్కువ సంఖ్యలో ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్పా రు. భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఉల్క ల వేగం గంటకు లక్షా ముప్పైవేల మైళ్లు ఉంటుంది. వెంటనే అవి వాతావరణంలోనే మండిపోతాయి కాబట్టి మానవులకు ఏ ప్రమాదమూ ఉండదు.

అలాగే.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఓ గ్రహశకలం భూమికి అతిదగ్గరగా రాబోతోంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేనప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ సంఘటనను ఒక అవకాశంగా మలుచుకుంటోంది. భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను పసిగట్టేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. విశ్వం నుంచి నిత్యం అనేకానేక గ్రహశకలాలు దూసుకొస్తూంటాయని.. కొన్ని భూమికి దగ్గరగా వెళతాయని మనందరికీ తెలుసు. వీటిని గమనించేందుకు నాసా ఆధ్వర్యంలోని ప్లానెటరీ డిఫెన్స్‌ కో ఆర్డినేషన్‌ ఆఫీస్‌ పనిచేస్తోంది.

తాజాగా 2012 టీసీ4 అని పేరు పెట్టిన ఓ గ్రహశకలం భూమికి కేవలం 6,800 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుంది. ఈ గ్రహశకలాన్ని తాము 2012లోనే గుర్తించామని అయితే అప్పట్లో ఇది వారం రోజుల పాటే పరిశీలనలకు అందుబాటులో ఉందని అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్త విష్ణురెడ్డి తెలిపారు. ఇప్పుడు దీన్ని మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories