100 కోట్ల పాత నోట్లు

100 కోట్ల పాత నోట్లు
x
Highlights

వంద కోట్లు... అన్నీ పాత నోట్లే.... మొత్తం ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు... కట్టలు కట్టలుగా ఓ గదిలో గుట్టగా పేర్చిన ఈ పాత నోట్లను కొత్త నోట్లుగా...

వంద కోట్లు... అన్నీ పాత నోట్లే.... మొత్తం ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు... కట్టలు కట్టలుగా ఓ గదిలో గుట్టగా పేర్చిన ఈ పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చే మాఫియా గుట్టు రట్టైంది. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌‌లో బిల్డర్‌ ఆనంద్‌ ఖత్రీ పాత ఇంట్లో ఈ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు ట్రంకుపెట్టెల నిండా గోనెసంచుల నిండా కుక్కి ఉన్న పాత నోట్ల కట్టలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. కాన్పూర్‌‌లో దొరికిన పాత నోట్లను లెక్కించడానికి పన్నెండు గంటలకు పైగా పట్టింది. సుమారు వంద మంది పోలీసులు 37 యంత్రాలతో వీటిని లెక్కించారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ తెల్లవార్లూ నోట్లను లెక్కిస్తూనే ఉన్నారు. పన్నెండు గంటలకు పైగా సాగిన లెక్కింపులో దాదాపు వంద కోట్ల వరకూ ఉన్నట్లు తేలింది.

అయితే, ఈ కేసుకు హైదరాబాద్‌తో లింకు ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన కోటేశ్వరరావు, రాజేశ్వరి రంగారావులు ఈ ముఠాలో కీలకంగా ఉన్నట్లు తెలిసింది. రద్దయిన నోట్లను ఖత్రీ సేకరించి అందజేస్తే.... కోటేశ్వరరావు, రంగారావులు వాటిని కొత్త నోట్లుగా మారుస్తున్నట్లు గుర్తించారు. ఇలా నోట్లను మార్చుకోవడానికి వచ్చేవారి నుంచి దాదాపు 40 శాతం కమీషన్‌ను వీరు తీసుకుంటున్నట్లు తేలింది. ఇందులో నోట్లను మార్చేవారికి 25శాతం కాగా మిగిలింది ఖత్రీ తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

పాత నోట్లు రద్దైనప్పుడు మొదలైన ఈ తతంగం ఇప్పటికీ నడుస్తోంది. హైదరాబాద్‌, కోల్‌కతా, వారణాసి నగరాల నుంచి కొద్దిరోజుల క్రితం పలువురు వ్యాపారవేత్తలు, దళారులు, కాన్పూర్‌కు చేరుకుని వేర్వేరు హోటళ్లలో బస చేసి పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చే డీల్‌ కుదుర్చుకున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ డీల్‌ వెనుక మాస్టర్‌ మైండ్‌ ఆనంద్‌ ఖత్రీయే. పాత నోట్లు తెచ్చే బాధ్యత ఖత్రీదే. వాటిని కొత్త నోట్లుగా మార్చే బాధ్యత హైదరాబాద్‌, కోల్‌కతాలకు చెందిన కోటేశ్వరరావు, అలీ హుస్సేన్‌, రాజేశ్వరి రంగారావు, మనీశ్‌ అగర్వాల్‌, సంజీవ్‌ అగర్వాల్‌ చూసుకుంటారు. ఖత్రీ ఏజెంట్లు దేశమంతా తిరిగి పాత నోట్లను సేకరిస్తారు.

గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ మాఫియా కార్యకలపాలు.... గత నెలలో పాత నోట్లు పట్టుకున్నప్పుడు బయటపడింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి పాత నోట్ల మార్పిడి ముఠాను పట్టుకున్నారు. గత నెలలో మీరట్‌లో ఒక బిల్డర్‌ ఇంట్లో 25 కోట్ల పాత నోట్లను పోలీసులు పట్టుకున్నప్పుడు... సదరు డీలరు హైదరాబాద్‌ దళారీల గురించిన సమాచారం ఇచ్చాడు. వారిపై నిఘా పెట్టగా.. ఖత్రీతో కలిసి వారు చేస్తున్న దందా గురించి తెలిసింది. వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ, ఆర్బీఐ సాయం తీసుకుని.. .ఖత్రీ ముఠాను నోట్లతో సహా పట్టుకున్నారు.


గత ఆరునెలల్లో ఖత్రీ అండ్‌ యాదవ్‌‌కి 15కోట్ల రూపాయల దాకా కొత్త నోట్ల రూపంలో ఇచ్చినట్టు నోట్లు మార్చిన ఏజెంట్లు చెప్పారని, పాత నోట్లను ఎలా మారుస్తున్నారనే విషయం మాత్రం చెప్పలేదన్నారు. అరెస్టయినవారిలో ఒక తెలుగు వ్యక్తి... ఒక కంపెనీ పేరు చెప్పాడని, ఆ సంస్థ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎన్నారైలేనని వివరించారు. అయితే, ఎన్నారైలు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునే సమయం కూడా ముగిసిపోయింది కాబట్టి.... ఈ ముఠా పాత నోట్లను ఎలా మారుస్తోందో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.

ఈనెల 4న హైదరాబాద్‌లో కోటి రూపాయలు, 10న 74లక్షల పాత నోట్లను పట్టుకుని మొత్తం ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోనే నోట్ల మార్పిడి జరుగుతోందని బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్లో ఈ ముఠాతో లింకులున్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కాన్పూర్ లో ఇవాళ కూడా మరికొన్ని చోట్ల దాడులు నిర్వహించనున్నారు. నిందితులు ఇచ్చిన సమచారం ఆధారంగా హైదరాబాద్లో కూడా దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories