రెడ్‌సార్ట్ మాదాల రంగారావు అస్తమయం

రెడ్‌సార్ట్ మాదాల రంగారావు అస్తమయం
x
Highlights

ఎర్ర సూర్యుడు కామ్రేడ్ మాదాల రంగారావు అస్తమించారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ...

ఎర్ర సూర్యుడు కామ్రేడ్ మాదాల రంగారావు అస్తమించారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పలు విప్లవ చిత్రాల్లో నటించిన రంగారావు రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. మాదాల రంగారావు స్వస్థలం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు. ఆయనకు భార్య పద్మావతి, కుమారుడు రవి ఉన్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నేతలు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాదాల రంగారావు కన్నుమూశారు. గతేడాది మే నెలలో తీవ్ర గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఈ నెల 20న శ్వాసకోస సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

మాదాల రంగారావు స్వస్థలం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు. ఆయనకు భార్య పద్మావతి, కుమారుడు రవి ఉన్నారు. 1948 మే 25న జన్మించిన రంగారావు ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు ఈయన సహాధ్యాయులు. నవతరం ప్రొడక్షన్స్‌ పతాకంపై మాదాల రంగారావు 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం లభించింది.

వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్రపావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’ తదితర చిత్రాల్లో నటించిన రంగారావు రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 80వ దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు.

విప్లవాత్మక చిత్రాల్లో విప్లవ నాయకుడిగా నటించి మెప్పించిన మాదాల.. తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని విప్లవాత్మక చిత్రాల నిర్మాణానికి నాంది పలికారు. ప్రజల, ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌లోని మాదాల రవి ఇంటికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories