ఎలాగైనా బలపరీక్ష నెగ్గాలి. ఇది కర్ణాటక సీఎం యడ్యూరప్ప లక్ష్యం...ఈ ధ్యేయం ఆయన ఒక్కడిదే కాదు..దక్షిణాది రాష్ట్రాల్లో కాలు మోపాలనే పట్టుదలతో ఉన్న...
ఎలాగైనా బలపరీక్ష నెగ్గాలి. ఇది కర్ణాటక సీఎం యడ్యూరప్ప లక్ష్యం...ఈ ధ్యేయం ఆయన ఒక్కడిదే కాదు..దక్షిణాది రాష్ట్రాల్లో కాలు మోపాలనే పట్టుదలతో ఉన్న కమలనాథుల టార్గెట్ కూడా ఇదే. అందుకు బలపరీక్షలో విజయం సాధించడానికి ఉన్న అన్ని దారులను బీజేపీ పెద్దలు వెతుకుతున్నారు. మరి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే యడ్యూరప్పకు ఉన్న ఆప్షన్స్ ఏంటి..?
టార్గెట్ ట్రిపుల్ వన్ . ఇప్పుడు కర్ణాటక సీఎం యడ్యూరప్ప లక్ష్యమిదే. మూడు రోజుల క్రితం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన యడ్యూరప్ప తన స్థానాన్ని పదిల పరుచుకోవాలంటే కావలసిన మ్యాజిక్ మార్క్ ఇది. కర్ణాటకలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే అసెంబ్లీలో ఆ పార్టీకి కావలసిన ఎమ్మెల్యే సంఖ్య ఇది. 111 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తేనే యడ్యూరప్ప సీఎంగా కొనసాగుతారు. లేదంటే... కుమార స్వామి కొద్ది గంటల్లోనే కన్నడ సింహాసనాన్ని అధిష్టించడం ఖాయం.
కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలకు గానూ 222 చోట్ల ఎన్నికలు జరగ్గా.. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 78 చోట్ల జేడీఎస్ 38 చోట్ల గెలిచాయి. కుమార స్వామి రెండు చోట్ల గెలుపొందడంతో ఆయన ఒక నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అంటే.. జేడీఎస్ బలం 37కి తగ్గింది. ఏ పార్టీ కూడా మెజార్టీ మార్కు సాధించకపోవడంతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సొంతంగా..జేడీఎస్, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించాయి. కానీ గవర్నర్ వాజూభాయ్ వాలా మెజార్టీ మార్కుకు ఏడు స్థానాలు తగ్గినా... బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి యడ్యూరప్ప చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీకి నమ్మిన బంటుగా పేరున్న కర్ణాటక గవర్నర్ యడ్యూరప్పకు బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈ 15 రోజుల్లోగా ఏడుగురిని ఎలాగైనా బీజేపీ వైపునకు లాక్కొనేందుకు , ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించేందుకు సమయమిచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. యడ్యూరప్ప కూడా 15 రోజులు గడువుంది కదా అనే ధీమాతోనే ఉన్నారు.
కానీ గవర్నర్ ఒకటి తలిస్తే..సుప్రీంకోర్టు మరొక తీర్పిచ్చింది. గవర్నర్ నిర్ణయంపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం...శనివారమే బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో బీజేపీ ప్లాన్ కాస్తా తల్లకిందులైంది. బలనిరూపణకు ఎక్కవ సమయం లేకపోవడం..అప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలిపోవడంతో మద్దతు కూడగట్టడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో యడ్యూరప్ప తన ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రత్యామ్నాయాల్లో మునిగిపోయారు.
ప్రస్తుతం యడ్యూరప్ప మొదటి లక్ష్యం మ్యాజిక్ ఫిగర్ 111 చేరుకోవడం. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా 104 స్థానాలుండగా..కాంగ్రెస్,జేడీఎస్, స్వతంత్రుల్లో ఎవరైనా ఏడుగుర్ని తనవైపుకు లాక్కోవాలి. అప్పుడ 111 మెజార్టీతో బలపరీక్షలో నెగ్గుతారు. ఇక కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే యడ్యూరప్ప ముందున్న మరో మార్గం. 14 మంది విపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీకి గైర్హాజరు అయ్యేలా చూడడం. అంటే ..బీజేపీ బలం కంటే విపక్ష ఎమ్మెల్యేల బలం తక్కువ అయ్యేలా చూడాలి. జేడీఎస్, బీఎస్పీల కూటమి బలం ప్రస్తుతం 117 కాగా.. వారిలో 14 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా చేయాలి. అప్పుడు బీజేపీ బలం 104 కంటే విపక్ష సభ్యుల సంఖ్య 103కి పడిపోతుంది. అప్పుడు యడ్యూరప్ప ఒక్క ఓటు మెజార్టీతో గట్టెక్కెతారు. కానీ 14 మందిని గెర్హాజరు అయ్యేలా చేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది.
ఈ రెండూ కాదంటే యడ్యూరప్ప ముందున్న మరో ప్రత్యామ్నాయం... 14 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం. అప్పడు విపక్షాల బలం తగ్గిపోతుంది. బీజేపీ ప్రభుత్వం నిలబడుతుంది. మరి యడ్యూరప్ప ఏ ప్లాన్ అమలు చేస్తారు..సుప్రీంకోర్టులో నెగ్గుకొచ్చిన కాంగ్రెస్, జేడీఎస్.... అసెంబ్లీలోనూ నెగ్గుకొస్తాయా.అనేది వేచి చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire