చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలివే

చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలివే
x
Highlights

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2019 సార్వత్రిక...

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలు ముందు ఇవే పూర్తి స్దాయి సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే రోజు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడతూ ఉండటం ఇందులో మూడు రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాజ్యసభలోని వివిధ పక్షాలతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సమావేశం కానున్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలంటూ అన్ని పక్షాలను ఆయన కోరున్నారు. అలాగే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న మంగళవారం అన్ని పక్షాలతో సమావేశం కానున్నారు. కీలకమైన బిల్లులు ఆమోదం పొందవలసి ఉన్నందున సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని సుమిత్రా మహాజన్ కోరనున్నారు.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలివే కానున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ సమావేశాలపై ఉంటుందని భావిస్తున్నారు. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుత సమావేశాల్లోనే భారత వైద్య మండలి సవరణ బిల్లును కూడా ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.

శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష పార్టీలు సమాలోచనలు జరుపుతున్నాయి. రాఫెల్‌ డీల్, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌ డైరక్టరేట్‌, ఆర్‌బిఐ, ఇతర రాజ్యాంగ సంస్థలపై మోడీ ప్రభుత్వ దాడిని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుండడంతో పార్లమెంటు ఉభయ సభల్లోను దీనిపై అగ్గి రాజుకోనుంది. ఆర్‌బిఐ అంతర్గత వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చేందుకు ప్రయత్నించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీయేతర పక్షాలతో నేడు నిర్వహించబోయే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతో ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది.

సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ నెలలోనే ప్రారంభం అవుతాయి. కానీ డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడం ఇది రెండోసారి. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆలస్యమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories