తెలంగాణలోని 20 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన కేసీఆర్ విస్తృత వ్యూహాన్ని అమలు చేశారు. ఆ స్థానాల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో సీనియర్...
తెలంగాణలోని 20 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన కేసీఆర్ విస్తృత వ్యూహాన్ని అమలు చేశారు. ఆ స్థానాల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో సీనియర్ మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలను ఇన్చార్జీలుగా నియమించి వారికి దిశానిర్దేశం చేశారు. ముందుగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఆ తర్వాత ప్రతి వారం రోజులకోసారి సర్వేలు జరిపించారు. ఆ ఫలితాల ఆధారంగా 20 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించిన కేసీఆర్ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు చేసిన టీ.20 వ్యూహాలు ఫలించాయి.
కేసీఆర్ టీ.20 వ్యూహం ఫలించింది. సెప్టెంబరు ఆరో తేదీన శాసనసభను రద్దుచేసి, ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత ప్రతీ పక్షం రోజులకోసారి సర్వేలు జరిపించారు. ఆ ఫలితాల ఆధారంగా 20 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించిన కేసీఆర్ అక్కడ ప్రత్యేక బాధ్యుల అవసరం ఉందని గ్రహించారు. వాటిని ప్రభావితం చేయడంతో పాటు అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలవగల నేతలను ఎంపికచేసి బాధ్యతలు కేటాయించారు. దీంతో ఆ 20 నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి గులాబీ జెండా ఎగురవేశారు.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి మద్దతుగా మంత్రి కేటీఆర్ను ఇన్ఛార్జీగా నియమించారు. ఆయన ఆ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు నేతలతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. అలాగే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విపక్ష పార్టీకి చెందిన డీకే అరుణ, రేవంత్రెడ్డిలు ప్రాతినిధ్యం వహించిన గద్వాల, కొడంగల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కార్యాచరణ రూపొందించి అమలు జరిపారు. అక్కడ మంత్రి హరీశ్రావును రంగంలోకి దింపారు. దీంతో హరీశ్ అక్కడికి వెళ్లి అభ్యర్థులు, నేతల సమన్వయంతో అక్కడ పట్టు సాధించారు.
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి ప్రాతినిధ్యం వహించిన హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్న నల్గొండలో ఈసారి విజయం సాధించాలనే తపనతో సీఎం వాటిపైనా కన్నేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో పార్టీని విజయం వైపుగా నడిపించేందుకు ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి , బడుగుల లింగయ్యయాదవ్, బూర నర్సయ్య గౌడ్ , తక్కెళ్లపల్లి రవీందర్రావులకు బాధ్యతలు అప్పగించారు. వీరు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, నల్లగొండ నియోజకవర్గాల్లోనే ఉండి ఎన్నికల వ్యూహాన్ని అమలుచేశారు. ఫలితంగా కోదాడ, నల్గొండ, తుంగతుర్తిల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా, హుజూర్నగర్లో గట్టి పోటీ ఇచ్చింది.
అలాగే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మానకొండూరు నియోజకవర్గాలలోనూ పార్టీ విజయం సాధించేందుకు వీలుగా అభ్యర్థులకు మరింత మద్దతు అవసరమని సీఎం భావించారు. పార్టీ సర్వేలో జగిత్యాలలో టీఆర్ఎస్కు 45.4 శాతం, కాంగ్రెస్కు 33.07 శాతం మద్దతు లభించింది. కోరుట్లలో టీఆర్ఎస్ 43.3 శాతం, కూటమికి 25.70, బీజేపీకి 31 శాతం మద్దతు వచ్చింది. మానకొండూరులో టీఆర్ఎస్కు 48, విపక్షాలకు 49 శాతం మద్దతు వచ్చింది. వీటి ఆధారంగా కేసీఆర్ ఈ మూడు చోట్ల విజయం కోసం ఎంపీలు వినోద్ ,కల్వకుంట్ల కవిత, లను రంగంలోకి దించారు. వీరు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయడంతో ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ టీఆర్ఎస్ గెలుపొందింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో మంత్రి చందూలాల్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నందున సీఎం తనకు సన్నిహితుడైన పల్లా రాజేశ్వర్రెడ్డిని అక్కడికి పంపించారు. పల్లా దాదాపు పక్షం రోజులూ అక్కడే ఉండి పూర్తిస్థాయిలో పనిచేశారు. కొన్ని మండలాల్లో పార్టీని బలోపేతం చేసినా మిగిలిన చోట్ల పార్టీ నేతలు సరిగా పనిచేయకపోవడంతో అక్కడ ఓటమి ఎదురైనట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, ముథోల్, ఖానాపూర్లలో అభ్యర్థులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, విఠల్రెడ్డి, రేఖాశ్యామ్నాయక్ల విజయానికి మాజీ ఎంపీ వేణుగోపాలచారితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణకుమార్రెడ్డిని సీఎం ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరు అక్కడ గట్టిగా పనిచేశారు. ఈ నాలుగు చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇల్లందు అభ్యర్థి కనకయ్యకు మద్దతుగా మడత వెంకట్ గౌడ్, మధుసూదన్లను నియమించారు. అక్కడ నేతల సమన్వయం సాధ్యంగాక అభ్యర్థి ఓటమిపాలయ్యారు. మధిర, వైరా, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో టీ.20 ప్లాన్ వర్కవుట్ అయ్యింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire