బీజేపీకి తగ్గిన 16 శాతం ఓట్లు.. కాంగ్రెస్‌కు పెరిగిన 14 శాతం ఓట్లు

Highlights

గుజరాత్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయ్. పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు మారిపోతున్నాయి. పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది....

గుజరాత్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయ్. పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు మారిపోతున్నాయి. పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఏబీపీ-సీఎస్‌డీఎస్‌ సర్వే ఫలితాల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయింగా తగ్గిపోతే కాంగ్రెస్‌‌కు రెండు శాతం ఓట్లు పెరిగాయి. రెండు రౌండ్ల సర్వేలు బీజేపీకి మొగ్గు చూపితే మూడో రౌండ్‌లో రెండు పార్టీల మధ్య పోటీ ఆసక్తి మారింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమీకరణలు మారిపోతున్నాయి. మొన్నటి వరకు బీజేపీకి అనుకూలంగా ఉన్న సర్వేలు తాజాగా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమానంగా ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. 50 నియోజకవర్గాల్లో 3, 655 మంది ఓటర్లు సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు 43శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అంతేకాకుండా ఏబీపీ-సీఎస్‌డీఎస్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఓ ఒపీనియన్‌ పోల్‌లో రెండు పార్టీల మధ్య అంతరం 10 సీట్ల లోపే ఉంటుందని సర్వేలో తేలింది. 182 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 91-99 సీట్లు, కాంగ్రెస్‌ 78-86 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.

ఏబీపీ, సీఎస్‌డీఎస్‌ 4 నెలల క్రితం నిర్వహించిన సర్వేలో బీజేపీకి 150 సీట్లు రావొచ్చని, కాంగ్రెస్‌కు 30 మించి వచ్చే ఛాన్స్‌ లేదని అంచనా వేసింది. గుజరాత్‌లో మోదీ ప్రభావం ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం అందుకు తగ్గ స్థాయిలో పైకి లేవలేకపోవడంతో బీజేపీకి మైనస్‌‌గా మారింది. మొదటి దశ పోలింగ్‌ 9న, రెండో దశ పోలింగ్‌ 14న జరగనుంది. ఫలితాలు ఈ నెల 18న ప్రకటించనుంది ఎన్నికల సంఘం.

రాహుల్‌ గాంధీ పర్యటన కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంది. ఆగస్ట్‌లో 59, అక్టోబర్‌లో 47, నవంబర్‌లో 43 శాతానికి పడిపోయింది బీజేపీ. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అదే సమయంలో ఆగస్ట్‌లో 29, అక్టోబర్‌లో 41, నవంబర్‌ నాటికి 43 శాతానికి చేరుకుంది. బీజేపీ ఓట్ల శాతం 16శాతం పడిపోతే కాంగ్రెస్‌ పార్టీకి 14 శాతం ఓట్లు పెరిగాయి. సౌరాష్ట్ర, కచ్‌లో 45, సెంట్రల్ గుజరాత్‌లో 41 శాతం బీజేపీకి, కాంగ్రెస్‌కు నార్త్‌ గుజరాత్‌‌లో 49, సౌత్‌ గుజరాత్‌లో 42 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ, సీఎస్‌డీఎస్‌ సర్వేలో తేలింది.

జిగ్నేశ్‌ మేవాని, హార్ధిక్ పటేల్, ఆల్పేశ్‌కుమార్‌‌లు కాంగ్రెస్‌ మద్దతివ్వడంతో కాంగ్రెస్‌కు మంచి బూస్ట్ వచ్చినట్లుంది. పటేళ్ల రిజర్వేషన్లకు మద్దతుగా హార్దిక్‌ పటేల్, ఓబీసీల కోసం ఆల్పేశ్‌కుమార్‌, దళితులు, ఇతర వర్గాల అభివద్ధి కోసం జిగ్నేశ్‌ మేవానిలు పోరాటం చేస్తున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, గ్యాస్‌ ధరలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో బీజేపీకి ఊహించని రీతిలో ఓట్ల శాతం పడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories