స్కూల్ యాజమాన్యం ధనదాహం మరో విద్యార్ధినిని బలి తీసుకుంది. ఫీజు కట్టలేదనే కారణంతో 9వ తరగతి విద్యార్ధినిని పరీక్ష రాసేందుకు నిరాకరించడంతో మనస్థాపానికి...
స్కూల్ యాజమాన్యం ధనదాహం మరో విద్యార్ధినిని బలి తీసుకుంది. ఫీజు కట్టలేదనే కారణంతో 9వ తరగతి విద్యార్ధినిని పరీక్ష రాసేందుకు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని మల్కాజిగిరి జేఎల్ఎస్ నగర్లో చోటుచేసుకుంది.
ఫీజుల భూతానికి మరో చిట్టితల్లి బలయింది.. ఫీజు చెల్లించనిదే పరీక్ష రాయనివ్వమంటూ స్కూల్ యాజమాన్యం విద్యార్థినిని ఇంటికి పంపించడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. స్కూలు నుంచి ఇంటికొచ్చిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్కు ఉరేసుకుంది. నన్ను పరీక్ష రాయనివ్వలేదు సారీ మమ్ అంటూ తల్లికి సూసైడ్ నోట్ రాసి ఆ బాలిక తనువు చాలించింది. మల్కాజిగిరి జేఎల్ఎస్ నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
జేఎల్ఎస్ నగర్కు చెందిన బాలకృష్ణ, సునీత భార్యాభర్తలు. బాలకృష్ణ పెయింటర్గా పనిచేస్తుండగా, సునీత బోయిన్పల్లిలోని ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తోంది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయి బీటెక్ చదువుతుండగా సాయిదీప్తి స్థానికంగా ఉన్న జ్యోతి హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది.
సాయిదీప్తి తండ్రి బాలకృష్ణ ఆర్థిక ఇబ్బందుల కారణంగా దీప్తి ఫీజులను చెల్లించలేకపోయాడు. కొద్దిరోజు లుగా పాఠశాల నిర్వాహకులు ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన పరీక్షలకు దీప్తిని అనుమతించలేదు. దీంతో పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తల్లిదండ్రులు విధులకు వెళ్లిపోగా అక్క సాయిలత ఇంటి వద్దనే ఉంది. త్వరగా వచ్చావేమిటని అక్క అడగటంతో ఫీజు కట్టలేదంటూ పరీక్ష రాయనీయలేదని బాధతో చెప్పింది.
బ్యాంకులో పని ఉండటంతో సాయిలత బయటికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి దీప్తి ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులసహాయంతో కిందికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీప్తి ఆత్మహత్యకు ముందు నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు.. సారీ మామ్ అని నోట్బుక్లో రాసిపెట్టినట్లు గుర్తించారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో ఫీజుచెల్లించలేకపోయామని, దాంతో ఇతర విద్యార్థుల ముందు దీప్తిని చులకనగా చూసేవారని ఆమె తల్లిదండ్రులు బాలకృష్ణ, సునీత ఆరోపించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని, విద్యార్థులను ఫీజుల కోసం వేధించేవారని అక్క సాయిలత చెబుతోంది. తొమ్మిదో తరగతి విద్యార్ధిని ఆత్మహత్యపై పాఠశాల నిర్వాహకురాలు లక్ష్మిని ప్రశ్నించగా సాధారణంగానే ఫీజు గురించి అడిగామని చెప్పా రు. కడుపునొప్పిగా ఉందని, ఇంటికి వెళతానని దీప్తి అడగటంతోనే ఇంటికి పంపామన్నారు. అయితే స్కూల్ యాజమాన్యం తీరుపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire