బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై తిరుమలలో రాళ్ళ దాడి జరిగింది. ఈ సంఘటన దేనికి సంకేతం ? ప్రత్యేక హోదా ఉద్యమకారులే దాడి చేశారా ? తెలుగుదేశం...
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై తిరుమలలో రాళ్ళ దాడి జరిగింది. ఈ సంఘటన దేనికి సంకేతం ? ప్రత్యేక హోదా ఉద్యమకారులే దాడి చేశారా ? తెలుగుదేశం కార్యకర్తలే బీజేపీ పై తమ ఆగ్రహాన్ని అలా ప్రదర్శించారా? దాడి విషయంలో నాయకులు ఏమంటున్నారు ? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ? కాన్వాయ్ పై దాడికి ప్రత్యేక హోదా అనేది పైకి కనిపించే కారణం మాత్రమేనా ? అసలు కారణం వేరే ఉందా ?
కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ప్రభుత్వానికి సారథి నరేంద్ర మోడి. అదే సమయంలో బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నది అమిత్ షా. కొన్ని దశాబ్దాలుగా ఇద్దరి మధ్య ఈ స్నేహబంధం కొనసాగుతున్నది. ఒకరికొకరు ప్రాణ స్నేహితులు. అలాంటి ప్రాణ స్నేహితుడి కాన్వాయ్ పై దాడి జరిగితే ప్రధాని ఊరుకుంటారా ? తగిన వ్యూహంతో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తారా ? సుమారుగా ఆరు నెలల క్రితం దాకా యుగళగీతం పాడిన బీజేపీ, తెలుగుదేశం పార్టీలు అసలెందుకు విడిపోయాయి ? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరి మనస్సుల్లో మెదలుతున్నాయి.
తిరుమలకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రత్యేక హోదా సెగ తగిలింది. స్వామి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఆయన కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని కార్ల అద్దాలు పగిలాయి. అంతకుముందు అమిత్ షాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. రోడ్డుపై రాకపోకలను అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మొత్తం మీద అమిత్ షా అక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళగలిగారు. మరి ఆయన ఊరికే ఉంటారా ? కాన్వాయ్ పై దాడిని చూసీ చూడనట్లుగా పట్టించుకోకుండా ఉంటారా ? ప్రత్యేక హోదా అంశానికి ఎలాంటి ఫినిషింగ్ టచ్ ఇస్తారు ? బీజేపీ, తెలుగుదేశం మధ్య ఇప్పటికే చెడిపోయిన సంబంధాలు ఇక ఎలాంటి మలుపు తిరగనున్నాయి ? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇక దాడి విషయమై అటు తెలుగుదేశం, ఇటు బీజేపీ నాయకులు స్పందించారు. దాడి జరగడం సరైంది కాదని టీడీపీ అగ్రనేతలు స్పష్టంచేశారు. ప్రజాగ్రహం ఆ రూపంలో వ్యక్తమైందని మరికొందరు టీడీపీ నాయకులు అన్నారు. సీపీఐ నాయకులు కూడా ఇదే తరహాలో మాట్లాడారు. బీజేపీ నాయకులు మాత్రం అమిత్ షా పై దాడికి చంద్రబాడు నాయుడే కారణమని ఆరోెపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు.
ప్రత్యేక హోదా అంశంపైనే అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరిగిందని, ప్రజల ఆగ్రహం అలా వ్యక్తమైందని కొందరు నాయకులు అంటున్నారు. సంఘటన జరిగిన తీరు చూస్తే మాత్రం అది పూర్తిగా నిజమని అనుకోలేం. బీజేపీ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు అమిత్ షా పర్యటనను ఒక అవకాశంగా వినియోగించుకున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. నాలుగేళ్ళ క్రితం పాలు, నీళ్ళలా కలసిన బీజేపీ, టీడీపీ ఆ తరువాత ఉప్పు, నిప్పులా ఎంుదకు మారిపోయాయి ? అలా మారేందుకు బీజాలు నాలుగేళ్ళ క్రితమే పడ్డాయా ? ప్రజల్లో తమపై వ్యతిరేకత పెరిగేందుకు బీజేపీ కారణమవుతోందని తెలుగుదేశం భావిస్తోందా ? వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు తమకు చేటు తెస్తాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోందా ? వీటన్నిటికీ సమాధానం అవుననే చెప్పవచ్చు. బీజేపీ నాయకులు కొందరు ఇటీవల చేసిన కొన్ని హెచ్చరికలు తెలుగుదేశం పార్టీలో కలవరాన్ని పెంచాయి. చంద్రబాబు నాయుడిపై ఉన్న కేసుల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తల్లో పెరిగిన ఆగ్రహమే అమిత్ షా కాన్వాయ్ పై దాడి రూపంలో బయటపడిందన్న భావన కలగడం సహజమే. రెండు పార్టీల మధ్య పొత్తుకు కాలం చెల్లడం ఈ విధమైన చర్యలకు దారి తీసిందేమోనన్న అనుమానాలూ కలగడం సహజమే.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire