మరో ప్రచ్ఛన్నం

మరో ప్రచ్ఛన్నం
x
Highlights

ఉత్తర కొరియా రూపంలో అమెరికాకు నేడు మరో విలన్ దొరికింది. ప్రచండ తుపానులతో అతలాకుతలమవుతున్న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంగళవారం నాడు జరిగిన...

ఉత్తర కొరియా రూపంలో అమెరికాకు నేడు మరో విలన్ దొరికింది. ప్రచండ తుపానులతో అతలాకుతలమవుతున్న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంగళవారం నాడు జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో ఉత్తర కొరియాపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలిసారి ప్రసంగంలో చండ్రనిప్పులు చెరిగారు. అణు విధానంపై ఉత్తర కొరియా తన వైఖరిని మార్చుకోకపోతే విధ్వంసం తప్పదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలపై దురాక్రమణ పూరిత యుద్ధాలు చేసిన అమెరికా, ఆ తర్వాత ఇరాన్, సిరియా దేశాలను విలన్‌లుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేసింది. ప్రస్తుతం అమెరికా గురి అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియాపైకి మళ్లింది. ఉగ్రవాదం లేదా దుష్ట రాజ్యాలు రాజ్యాధినేతల బారి నుంచి అంతర్జాతీయ సమాజాన్ని ఉద్ధరిస్తున్న పేరుతో భౌగోళిక రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం ద్వారా అంతర్గత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు యుద్ధాన్ని, యుద్ధ మూల్యాన్ని ప్రపంచ దేశాలపై రుద్దడం అమెరికాకు అలవాటుగా మారింది. ఆ క్రమంలోనే ట్రంప్ ప్రసంగం కొరియా ద్వీప కల్పంలో మరో యుద్ధానికి పిలుపునిచ్చినట్లున్నది.

ఈయూ పెట్టుబడి పెంపంక కేంద్రంగా మారిన చైనా చౌక వినిమయ సరుకులతో అమెరికా సహా ప్రపంచ మార్కెట్లను ముంచెత్తడం దాని ఆర్థిక పెత్తనం దెబ్బతినింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆధిపత్యం సాధించిన చైనా భౌగోళిక రాజకీయాల్లో అమెరికా పెత్తననానికి సవాలుగా నిలిచింది. ఈ క్రమంలో అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ దీర్ఘ కాలంగా నిరంకుశ రాజ్యాలుగా కొనసాగుతున్న ఉత్తర కొరియా వంటి గతంలో సోవియట్ కూటమి దేశాలూ చైనా పక్షాన నిలిచాయి. దాంతో అమెరికాకు, ఈయూ సహా పలు ఆసియా దేశాల మద్దతుతో చైనాకు మధ్య భౌగోళికాధిపత్య పోటీ తీవ్రతరమైంది. వాణిజ్యంలో పై చేయి సాధించిన చైనా డాలర్ స్థానంలో బహుళ కరెన్సీల కేంద్రిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రావాలన్న డిమాండ్‌తో మొదటగా కరెన్సీ యుద్ధాన్ని ప్రారంభించింది. అది క్రమంగా భౌగోళిక రాజకీయ సమీకరణలకు విస్తరించడంతో మరో ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీసింది.

ఈ నేపథ్యంలో అమెరికా నేతృత్వంలో భద్రతా మండలిలో వివిధ ఆర్థిక ఆంక్షలపై చైనా, రష్యా లు సైతం సహకరించినా, అవి దొడ్డిదారిన ఉత్తర కొరియాకు సహకరిస్తూనే ఉండడం వల్ల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయి. కొరియా సమస్యకు గతంలో జరిగిన ఆరు దేశాల మధ్య చర్చలను కొనసాగించడం మంచిదన్న సూచలను అమెరికా నిర్లక్ష్యం చేసింది. ఆ క్రమంలో ఉత్తర కొరియాను పూర్తిగా నిర్మూలిద్దామని ఐక్యరాజ్య సమితి వేదికపై ట్రంప్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల విదేశాంగ విధానం వల్ల భారత్ క్రమంగా అమెరికా కూటమి దేశంగా మారిపోతోంది. భౌగోళిక రాజకీయ వ్యూహంలో భాగంగా అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని అమలు చేస్తే దేశ ప్రజల ఆర్థిక, సామాజిక సార్వభౌమత్వం, భద్రత ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. అమెరికా, చైనా సామ్రాజ్యవాద దేశాల ప్రపంచాధిపత్య పోటీని, యుద్ధ శంఖారావాల్ని ప్రపంచ ప్రజలు ప్రపంచ శాంతి ఉద్యమం ద్వారా నిలువరించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories