క్వారీలో భారీ పేలుడు...11 మంది కూలీలు మృతి

x
Highlights

క్వారీలో అకస్మాత్తుగా జరిగిన పేలుళ్లు పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం వచ్చిన 11 మంది కూలీలకు సమాధి కట్టాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారంతా అగ్ని...

క్వారీలో అకస్మాత్తుగా జరిగిన పేలుళ్లు పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం వచ్చిన 11 మంది కూలీలకు సమాధి కట్టాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారంతా అగ్ని కీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్‌ వద్ద క్వారీలో రాత్రి ఉన్నట్టుండి భారీ పేలుళ్లు జరిగాయి. వెనువెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో కొందరి శరీరభాగాలు చెల్లాచెదురుగా చుట్టుపక్కల ఎగిరిపడ్డాయి. మరో ఐదుగురు కూలీలు అగ్నికీలల్లో చిక్కుకుని సగం శరీరం కాలిపోయి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. క్షతగాత్రులను తొలుత ఆలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

మృతులు, క్షతగాత్రులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని గుర్తించారు. పేలుళ్ల అనంతరం మంటలు ఎగసిపడటంతో క్వారీ సమీపంలో ఉన్న షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. షెడ్డులో మరికొందరు చిక్కుకుని మృతిచెంది ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుళ్ల ధాటికి క్వారీ వద్దనున్న రెండు లారీలతోపాటు మూడు ట్రాక్టర్లు కాలిబూడిదయ్యాయి. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

హత్తిబెళగల్‌ సమీపంలో చౌదరి కనెస్ట్రక్షన్స్‌ క్వారీ ఉంది. దానికి అనుబంధంగా కంకర క్రషర్స్‌ ఉన్నాయి. ఈ క్వారీలో దాదాపు 30 మంది ఒడిశా కూలీలు నిత్యం పనిచేస్తుంటారు. కొందరు సమీప గ్రామాల్లో నివాసం ఉంటుండగా, మరికొందరు అక్కడే జీవనం సాగిస్తున్నారు. క్వారీ పేలుళ్ల కోసం శుక్రవారం ఉదయం తెప్పించిన జిలెటిన్‌ స్టిక్స్‌ను క్వారీ సమీపంలో కూలీల కోసం నిర్మించిన షెడ్లలోని ఒకదానిలో నిల్వ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ బ్లాస్టింగ్ చేస్తున్న క్రమంలో అవి పేలి ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. భారీ శబ్దంతో ఒక్కసారిగా ఎర్రని మంటలు ఎగిసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు ధాటికి ఇరవై కిలోమీటర్ల మేర భూమి కంపించింది. క్వారీకి సమీపంలో ఉన్న హత్తిబెళగల్‌, అగ్రహారం, కురవల్లి, ఆలూరు, మొలగవల్లి గ్రామాల్లో పది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ఏం జరిగిందో తెలియక భయభ్రాంతులకు గురయ్యారు. పేలుళ్లకు అసలు కారణమేంటి? కారకులెవరు? అన్న దానిపై అటు అధికార యంత్రాంగం గానీ..ఇటు నిర్వాహకులు గానీ స్పష్టత ఇవ్వలేదు.

అయితే, చిప్పగిరి మండలం ఏరూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాస చౌదరి.. హత్తి బెళగల్ వద్ద కొండల్లో సర్వే నెంబర్ 969లో ఒక క్వారీకి మాత్రమే అనుమతి తీసుకుని, మరో రెండు క్వారీలు అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. మూడు క్రషర్ల వద్ద పెద్ద ఎత్తున కంకర రాయి కోసం భారీగా బ్లాస్టింగ్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్వారీకి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్లతో క్వారీ యజమాని మైనింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. క్వారీ పేలుడు ఘటనతో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. క్రషర్ ఫ్యాక్టరీల యజమానులంతా పోలీస్ స్టేషన్లకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.

హత్తి బెళగల్ వద్ద క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వివరించేందుకు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌లను సీఎం ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories